
మంచిర్యాల,వెలుగు:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నా మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు నష్టపోతున్నారు. ఆరేండ్ల కింద బెల్లంపల్లిలో నిర్మాణం చేపట్టిన మ్యాంగో మార్కెట్ను మధ్యలోనే వదిలేయడంతో మామిడి కాయలను అమ్ముకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఏటా నాగ్పూర్ మార్కెట్పైనే ఆధారపడుతూ అక్కడ కమీషన్ ఏజెంట్ల చేతిలో నిలువుదోపిడీకి గురవుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మ్యాంగో మార్కెట్ను ప్రారంభిస్తామని చెప్పడమే తప్ప ఆ దిశగా చేసిందేమీ లేదు.
ఆరేండ్లు గడిచినా....
జిల్లాలోని మ్యాంగో మార్కెట్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని 2016లో అప్పటి మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్రావు బెల్లంపల్లిలో మ్యాంగో మార్కెట్ను శాంక్షన్ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్కు అనుబంధంగా రూ.2.50 కోట్లతో మార్కెట్ పనులు ప్రారంభించారు. కానీ నిధుల కొరతతో తూతూమంత్రంగా రెండు షెడ్లు నిర్మించి వదిలేశారు. మామిడి కాయలను నిల్వ ఉంచేందుకు అవసరమైన కోల్డ్ స్టోరేజీ నిర్మాణం గురించి మర్చిపోయారు. మార్కెట్లో రైతులకు, వ్యాపారులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. దీంతో గత ఆరేండ్లుగా మ్యాంగో మార్కెట్ పిచ్చిమొక్కలతో నిండిపోయి చిట్టడవిని తలపిస్తోంది. దీనికోసం వెచ్చించిన కోట్ల రూపాయల నిధులు దుబారా అయ్యాయి.
నాగ్పూర్లో దోపిడీ....
జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉండగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మరో 20వేల ఎకరాల్లో ఉన్నాయి. బెల్లంపల్లి, తాండూర్, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, జైపూర్, మందమర్రి, కాసిపేట మండలాలతో పాటు హాజీపూర్, లక్సెట్టిపేట ప్రాంతాల్లో నలభై యాభై ఏండ్ల నుంచి తోటలను సాగు చేస్తున్నారు. ఎకరానికి సగటున ఐదు నుంచి ఏడు టన్నుల లెక్కన ఏటా రూ.100 కోట్లకు పైగా విలువైన దిగుబడులు వస్తున్నాయి. జిల్లాలో మార్కెట్ లేకపోవడంతో రైతులు సుమారు 300 కిలోమీర్ల దూరంలో ఉన్న నాగ్పూర్కు తీసుకెళ్తున్నారు. అక్కడ కమీషన్ ఏజెంట్లు రకరకాల కారణాలు చెప్పి దోచుకుంటున్నారు. ఒక్కోసారి ట్రాన్స్పోర్టు చార్జీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాప్రతినిధుల చొరవతోనే....
కోట్ల రూపాయలు వెచ్చించి నిరుపయోగంగా వదిలేసిన బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్ను ఈసారైనా స్టార్ట్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులు, అధికారులు ట్రేడర్లు రావడం లేదనే సాకుచూపుతూ చేతులు దులుపుకుంటున్నారు. బెల్లంపల్లి పట్టణం నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైల్వే, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. నాగ్పూర్ మార్కెట్లో పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, కోల్కతా ప్రాంతాలకు చెందిన ట్రేడర్లు పెద్ద మొత్తంలో బిజినెస్ చేస్తుంటారు. వారితో చర్చించి బెల్లంపల్లికి రప్పించగలిగితే మామిడి రైతులకు వ్యయప్రయాసలు తప్పుతాయి.
మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి
జిల్లాలో మామిడికి మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో మహారాష్ట్రలోని నాగ్పూర్ వెళ్లి అమ్ముకుంటున్నాం. అక్కడ దళారులు సిండికేట్ అయి రైతులను దోచుకుంటున్రు. మేము ఇక్కడినుంచి ఫోన్ చేసినప్పుడు ధర మంచిగున్నదని చెప్పి తీరా అక్కడికి వెళ్లాక తక్కువ ధర కట్టి నిలువునా ముంచుతున్రు. బెల్లంపల్లి మార్కెట్ పనులు పూర్తి చేసి ఈ సీజన్లో కొనుగోళ్లు చేస్తే ఈ ప్రాంత రైతులకు మేలు జరుగుతుంది.
- గొర్లపల్లి బాపు, మామిడి రైతు , నెన్నెల
తోటలు తొలగిస్తున్న రైతులు....
జిల్లాలో మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం, నాగ్పూర్ మార్కెట్లో కనీస మద్దతు ధర రాకపోవడం వంటి కారణాలతో రైతులు విసుగెత్తారు. దీనికితోడు యాజమాన్య పద్ధతులపై హార్టికల్చర్ అధికారుల నుంచి సరైన సలహాలు, సూచనలు అందడం లేదు. ఇరవై ముప్పై ఏండ్ల తోటల్లో ఆశించిన దిగుబడులు రాక నష్టాల పాలవుతున్నారు. దీంతో బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలువురు రైతులు మామిడి తోటలను తొలగిస్తున్నారు. పత్తితో పాటు ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో మామిడి తోటలు కనుమరుగయ్యే ప్రమాదం లేకపోలేదు.