ఊర్లకు అందని సాగు నీరు.. ఆందోళనలో రైతన్నలు

ఊర్లకు అందని సాగు నీరు.. ఆందోళనలో రైతన్నలు

పెద్దపల్లి/ మిర్యాలగూడ, వెలుగు: పొలాలకు సరిపడా నీళ్లందకపోవడంతో యాసంగిలో వరి వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక వైపు సర్కార్ చెప్పిన విధంగా 24 గంటల కరెంటు ఉంటలేదు. ఏ టైంలో కరెంటు వస్తదో తెలియని పరిస్థితి ఉంది. పెద్దపల్లి జిల్లాలో రైతులు యాసంగిలో ఎక్కువగా ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. అయితే ఎస్సారెస్పీ నీళ్లు ఆశించినంతగా రాకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. నాగార్జున సాగర్​ ప్రాజెక్ట్​ కింద ఉన్న ఆయకట్టు పరిస్థితి సైతం ఇలానే ఉంది.  నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో సాగర్​ ఎడమ కాల్వ కింద 2.48 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. సుమారు 82 మేజర్లతో పాటు పలు మైనర్ కాల్వల ద్వారా ఇరిగేషన్​ ఆఫీసర్లు నీరు అందిస్తున్నారు. అయితే కాల్వల్లో పూడిక, ఇతర పిచ్చి మొక్కలు పెరగడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. మరోవైపు పొట్ట దశకు చేరిన వరి పంటకు అగ్గి తెగులు సోకి రైతన్నలు ఆగమవుతున్నారు. 

ఊర్లకు అందని సాగు నీరు

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని శ్రీనివాస్​నగర్, దుబ్బతండా, సామెగాని తండాలకు చిల్లాపురం వజీరాబాద్ మేజర్​ పరిధిలో ఆర్​16 మైనర్​ కెనాల్ ఉంది.  ఈ కెనాల్​ కింద సుమారు 2,500 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే మూడో విడత వారబందీ ప్రకారం ఈ మైనర్​ కాల్వకు నీటి విడుదల ఈ నెల 1న ముగిసింది.  మళ్లీ 7వ తేదీ నుంచి 4వ విడత నీటి విడుదల కొనసాగాల్సి ఉండగా.. కాల్వలో పూడిక, చెత్త చెదారం, తూముల్లో రాళ్లు అడ్డుపడటం, డిజైన్​ డిశ్చార్జ్​ ప్రకారం విడుదల చేయకపోవడంతో పది రోజులుగా పంట భూములకు నీళ్లు లేక  నెర్రలు పడి అగ్గి తెగులు అధికమైందని రైతులు వాపోతున్నారు. శుక్రవారం ఉదయం వరకు నీటి కోసం వేచి చూసిన ఈ గ్రామాల రైతులు ఇరిగేషన్​ఆఫీస్​ ముట్టడికి రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక ఇరిగేషన్​ఆఫీసర్లు సామెగాని తండాకు చేరుకుని పంట పొలాలను పరిశీలించారు. పంటలకు అవసరమైన సాగు జలాలు సాఫీగా అందేందుకు పై ఆఫీసర్లతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. 

నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలె 

నీళ్లు సరిగ్గా అందక పంటలు ఎండిపోతున్నాయి. సర్కార్ సరిగ్గా కరెంటు ఇస్తే మాకు ఈ బాధ ఉండేది కాదు. ఇప్పుడు పూర్తిగా ఎస్సారెస్పీ వారబందీ నీళ్ల మీదనే ఆధారపడాల్సి వస్తోంది. వారబందీ ఇస్తున్నా చివరి ఆయకట్టు భూముల వరకు అందేలా ఇస్తలేరు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి. సర్కారు వెంటనే 24 గంటల కరెంటుతో పాటు ఎస్సారెస్పీ వారబందీ నీళ్లు అందియ్యాలి. - చేగొండ రాజేందర్, ఎదులాపూర్, పెద్దపల్లి జిల్లా

ఏడెకరాలు నెర్రలు బారింది

సామెగాని తండా సమీపంలో  ఏడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని హెచ్​ఎంటీ రకం వడ్లు వేసిన. ఈ భూములకు పక్కనే ఆర్ 1 6 కెనాల్​ ఉంది. అయితే ఈ కెనాల్​ వజీరాబాద్​ మేజర్ నుంచి మొత్తం 6 కిలోమీటర్లు పొడవు ఉంది. కాల్వలో పూడిక చేరి, మొక్కలు పెరిగి చివరి దాకా నీళ్లు రావటం లేదు. పది రోజులుగా నీళ్లు లేక పంట భూములు నెర్ర బారినయి.  అసలే పంటల పెట్టుబడి పెరిగి ఇబ్బంది పడుతున్నం. ఇప్పుడు నీళ్లు రాక అగ్గి తెగులు ఎక్కువై నిద్రపడ్తలేదు. ఇరిగేషన్​అధికారులు మా బాధలను అర్థం చేసుకోవాలే.  

 వాసంశెట్టి వెంకట్రావు, శ్రీనివాస్​ నగర్​, మిర్యాలగూడ