
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధులు జమ చేసింది. దీనికోసం మంగళవారం (june 17) రూ.1,551.89 కోట్లు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశారు.
దీంతో ఇప్పటివరకు మొత్తం 51.70 లక్షల మంది రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ.3,901.72 కోట్ల నిధులు జమ చేశారు. ఇప్పటివరకు అందిన నిధుల్లో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 3.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.180 కోట్లు జమ చేశారు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 2.14 లక్షల రైతులకు రూ.123 కోట్ల నిధులు అందాయి.
సిద్దిపేట జిల్లాలో 2.07 లక్షల మంది రైతులకు రూ.111 కోట్ల నిధులు అందగా, సూర్యాపేట జిల్లాలో 1.74 లక్షల మంది రైతులకు రూ.103 కోట్ల నిధులు అందాయి. మిగతా రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.