రోడ్డెక్కిన ధాన్యం రైతులు.. స్తంభించిన ట్రాఫిక్

రోడ్డెక్కిన ధాన్యం రైతులు.. స్తంభించిన ట్రాఫిక్
  •     తడిసిన ధాన్యం  కొనుగోలు చేయాలని డిమాండ్
  •     స్తంభించిన ట్రాఫిక్

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ పట్టణంతో  పాటు  మండలంలో కురిసిన భారీ వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని వెంటనే అధికారులు కొనుగోలు చేయాలని సూర్జపూర్, బాదనకుర్తి  గ్రామాలకు చెందిన రైతులు డిమాండ్ చేశారు.   ఖానాపూర్ మండలం సూర్జపూర్ గ్రామ సమీపంలోని మెట్‌‌పల్లి, కరీంనగర్ ప్రధాన రహదారి పై  రైతుల ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యాన్ని నిరసిస్తూ  రాస్తారోకో చేపట్టారు.  రోడ్డుపై వర్షంతో తడిసిన ధాన్యాన్ని అడ్డం పెట్టి నిరసన తెలిపారు. రెండు గ్రామాలకు చెందిన రైతులు మాట్లాడుతూ..  కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నామన్నారు.

కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని, వర్షం కురిస్తే ధాన్యం తడిసి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ  ఆర్.శంకర్  రైతులతో మాట్లాడా రు. కొనుగోలు కేంద్రం  నిర్వాహకులతో మాట్లాడి  రేపటిలోగా  పూర్తిగా  ధాన్యం తరలించేలా చర్యలు  తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.