మార్కింగ్​ ఇచ్చి హద్దురాళ్లు పాతిన తర్వాత రూట్ మార్చిన్రు

మార్కింగ్​ ఇచ్చి హద్దురాళ్లు  పాతిన తర్వాత రూట్ మార్చిన్రు

మెదక్/నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్​) అలైన్​మెంట్ మార్పుపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఆర్ఆర్ఆర్​ఫస్ట్​ ఫేజ్​మెదక్​జిల్లాలో నర్సాపూర్​, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట, తూప్రాన్​ మండలాల మీదుగా వెళ్లనుంది. ఇందుకు సంబంధించి దాదాపు ఏడాది కిందటే ఫీల్డ్ లెవెల్​సర్వే జరగ్గా, కన్సల్టెన్సీ సంస్థ ఆరు నెలల క్రితమే రింగ్​రోడ్డు వెళ్లే రూట్​లో మార్కింగ్​ఇవ్వడంతోపాటు, హద్దురాళ్లు పాతింది. భూసేకరణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గెజిట్​నోటిఫికేషన్​జారీ చేయగా, కొద్ది రోజులుగా అలైన్​మెంట్​సర్వే జరుగుతోంది. కాగా, పలు చోట్ల ఏడాది కిందట సర్వే నిర్వహించి మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి కాకుండా వేరే దగ్గర నుంచి రింగ్​రోడ్డు నిర్మాణానికి భూసేకరణ సర్వే చేస్తున్నారు. అధికార పార్టీ లీడర్ల భూములు కోల్పోకుండా ఉండేందుకే రింగ్ రోడ్డు అలైన్​మెంట్​లో మార్పులు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. 

పేద రైతులకు నష్టం 
అలైన్​మెంట్​ మార్చడం వల్ల పేద రైతులు ఎక్కువగా నష్టపోనున్నారు. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లిగేట్​దగ్గర ఇంటర్​చేంజ్​జంక్షన్​ నిర్మించనున్నారు. దీని కోసం ఇక్కడ 60 నుంచి 80 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇదివరకు సర్వే చేసినపుడు రెడ్డిపల్లి చౌరస్తా దగ్గర నుంచి పెద్దచింతకుంట మధ్య నుంచి రింగ్​రోడ్డు వెళ్తుందని చెప్పారు. ఆ ప్రాంతంలో హద్దులు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మాత్రం రెడ్డిపల్లి చౌరస్తా నుంచి మెదక్ రూట్​లో రింగ్ రోడ్డు నిర్మించేలా భూసేకరణకు చేపట్టారు. పెద్దచింతకుంట వైపు ఓ కేబినెట్​మంత్రి బంధువుల భూములున్నాయని, అందువల్ల వారికి నష్టం కలుగకుండా ఉండేందుకే పరపతి ఉపయోగించి అలైన్​మెంట్​మార్పించారని రెడ్డిపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. పాత సర్వే ప్రకారం 30 మంది రైతుల భూములు మాత్రమే పోయేవని, అలైన్​మెంట్​మార్చడం వల్ల దాదాపు 100 మంది చిన్న, సన్నకారు రైతుల భూములు పోతున్నాయని తెలిపారు. అలాగే శివ్వంపేట మండలంలో కూడా అలైన్​మెంట్​మార్చడంపై నిరసన వ్యక్తమవుతోంది. పాత సర్వే ప్రకారం అల్లీపూర్ నుంచి రింగ్ రోడ్డు వెళ్లాల్సి ఉండగా, ఆ ప్రాంతంలోని అధికార పార్టీ లీడర్ల భూములకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు  లింగోజిగుడ మీదుగా వెళ్లేలా అలైన్​మెంట్​మార్చారంటున్నారు. 

ఎమ్మెల్యేకు మొర 
ఇటీవల నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి రెడ్డిపల్లికి రాగా స్థానిక రైతులు ఆయనను కలిసి రింగ్​రోడ్డు అలైన్​మెంట్​మార్పు వల్ల కలిగే నష్టం గురించి వివరించారు. గతంలో ఓ వైపు నుంచి రోడ్డునిర్మించేలా సర్వే చేసి హద్దులు పెట్టి, ఇపుడు అలైన్​మెంట్​మార్చడం వల్ల వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అంతేగాక చెరువుకు కూడా నష్టం కలుగుతుందన్నారు. పాత సర్వే ప్రకారమే రింగ్​రోడ్డు నిర్మించేలా చూడాలని కోరారు. 

సర్వేను అడ్డుకున్న రైతులు
భూసేకరణ ప్రక్రియలో భాగంగా అలైన్​మెంట్ సర్వే కోసం గత శుక్రవారం నర్సాపూర్​ఇన్​చార్జి తహసీల్దార్ మూర్తి, ల్యాండ్ సర్వే డిప్యూటీ ఇన్​స్పెక్టర్​శేఖర్ వర్మ, సర్వేయర్ లాల్య రెడ్డిపల్లికి రాగా స్థానిక రైతులు అడ్డుకున్నారు. కాంగ్రెస్​, బీజేపీ నాయకులు వీరికి మద్దతు పలికారు. అలైన్​మెంట్​ఎందుకు మార్చారని అధికారులను నిలదీశారు. కొంత మంది పెద్ద రైతుల కోసం ఎంతో మంది పేద రైతులకు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. రైతుల అభ్యంతరాలతో ఆఫీసర్లు సర్వే చేయకుండానే వెనుదిరిగారు. 

నాలుగెకరాలు పోతోంది
మార్చిన అలైన్​ మెంట్​ప్రకారం రింగ్ రోడ్డు నిర్మాణంలో మాది నాలుగు ఎకరాలు పోతోంది. ఇది ఎంతో విలువైన భూమి. మా కుటుంబానికి ఇదే ఆధారం. ఈ భూ‌‌మి పోతే మా పరిస్థితి ఏమి కావాలి. ప్రభుత్వం మాకు మార్కెట్​ వాల్యూ ప్రకారం పరిహారం ఇస్తుందా ?
– ప్యాట మహేశ్​గౌడ్ , రైతు, రెడ్డిపల్లి

బడా రైతుల కోసం అలైన్​మెంట్ మార్పు
రెడ్డిపల్లి రైతులు ఇదివరకే కాళేశ్వరం కాల్వలు, సొరంగం నిర్మాణం, హైటెన్షన్​లైన్​ కోసం భూములిచ్చారు. ఇప్పుడు మళ్లీ రింగ్​రోడ్డుకు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. అంతేగాక అధికార పార్టీ నాయకుల భూములకు నష్టం కలుగకుండా చూసేందుకే నర్సాపూర్​మండలం పెద్దచింతకుంట నుంచి వెళ్లాల్సిన రింగ్​రోడ్డును రెడ్డిపల్లి వైపు మార్చారు. దీనివల్ల రెడ్డిపల్లికి చెందిన అనేక మంది పేద రైతులు ఉన్నకొద్దిపాటి భూమి కోల్పోయి రోడ్డున పడతారు. 
– ఆంజనేయులు గౌడ్​,   టీపీసీసీ అధికార ప్రతినిధి

ఎమ్మెల్యే అనుచరుల బెనిఫిట్ ​కోసం  
నర్సాపూర్​ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు ఇద్దరు, ముగ్గురి కోసం అధికారుల మీద ఒత్తిడి చేసి రింగ్​రోడ్డు అలైన్​మెంట్ మార్చారు. వారికి లాభం చేకూర్చేందుకు 10, 20, 30 గుంటల భూమి ఉన్న రైతుల పొలాల మీదుగా రింగ్​రోడ్డు నిర్మించేలా చూస్తున్నారు. ఇది చాలా అన్యాయం. దీన్ని మేం చూస్తూ ఊరుకోం. అవసరమైతే కోర్టుకు వెళ్తాం. 
– సింగాయిపల్లి గోపి, బీజేపీ నర్సాపూర్​ సెగ్మెంట్​ ఇన్​చార్జి