సెల్​ఫోన్​ పెట్టిన చిచ్చు.. రైలు కింద పడి తండ్రీకూతుళ్లు మృతి

సెల్​ఫోన్​ పెట్టిన చిచ్చు.. రైలు కింద పడి తండ్రీకూతుళ్లు మృతి
  •      కొడుకు మొబైల్​కు అడిక్ట్​ అయ్యాడని ఇంట్లో గొడవ
  •     మనస్తాపంతో సూసైడ్​ చేసుకునేందుకు పట్టాలపైకి పరిగెత్తిన తండ్రి
  •     ఆపేందుకు వెళ్లిన కూతురు
  •     రైలు ఢీకొట్టడంతో ఇద్దరూ మృతి 

పాలమూరు, వెలుగు : పచ్చని కుటుంబంలో సెల్​ఫోన్​ చిచ్చు పెట్టింది. కొడుకు మొబైల్​ ఫోన్​కు బానిస కాగా, తన భార్య పట్టించుకోకపోవడం వల్లే ఇలా తయారయ్యాడంటూ భర్త ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు. కొడుకును మందలించాడు. ఇది చినికి చినికి గాలివానలా మారింది. తర్వాత మనస్తాపం చెందిన తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లగా అతడిని కాపాడేందుకు కూతురు కూడా వెంటే పరిగెత్తింది. ఈ క్రమంలో రైలు ఢీకొనడంతో ఇద్దరూ చనిపోయారు. ఈ విషాద ఘటన మహబూబ్​నగర్ ​జిల్లా కేంద్రంలోని ఏనుగోండ సమీపంలో మంగళవారం జరిగింది. 

మహబూబ్​నగర్​రైల్వే ఎస్ఐ సయ్యద్​అక్బర్​ కథనం ప్రకారం.. వికారాబాద్​ జిల్లా చౌడాపూర్​కు చెందిన శివా నంద్​ (46)కు భార్య లావణ్య, కూతురు చందన (20), కొడుకు సాయికృష్ణ ఉన్నారు. కొన్నేండ్ల కింద కుటుంబతో కలిసి పాలమూరుకు వచ్చిన శివానంద్​ ఏనుగొండ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఇక్కడే ఉన్న 

ఓ ప్రైవేట్ ​హాస్పిటల్​ ఓనర్ ​వద్ద డ్రైవర్​గా పని 

చేస్తున్నాడు. అదే హాస్పిటల్​లో శివానంద్​కూతురు చందన ల్యాబ్​ టెక్నీషియన్​గా పని చేస్తోంది. సాయికృష్ణ ఓ కాలేజీలో ఇంటర్ ​చదువుతున్నాడు. సాయికృష్ణ సెల్​ఫోన్​కు అడిక్ట్​ అయ్యాడు. ఎప్పుడు సెల్​ఫోన్​లో గేమ్స్​ఆడుతూ ఉండేవాడు. కొడుకు ఎప్పుడూ సెల్​ఫోన్ ​పట్టుకునే కనిపిస్తుండడంతో శివానంద్ తిట్టేవాడు. అయినా సాయి తీరులో మార్పు రాలేదు. సోమవారం కూడా ఇలాగే కనిపించడంతో పట్టించుకోవడం లేదంటూ భార్యను, కొడుకును తిట్టాడు. ఇది పెద్ద గొడవకు దారి తీసింది. దీంతో మనస్తాపంతో అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకునేందుకు శివానంద్​సమీపంలోని రైల్వే పట్టాలపైకి వెళ్లాడు. 

గమనించిన కూతురు చందన ఆగు నాన్నా అంటూ వెనకే పరిగెత్తింది. అదే టైంలో వచ్చిన అమరావతి సూపర్​ఫాస్ట్ ​ఎక్స్​ప్రెస్ రైలు​ ఢీకొట్టుకుంటూ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. విషయం భార్యకు తెలియడంతో స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని హాస్పిటల్​కు తరలించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.