
- కొడుకు మొబైల్కు అడిక్ట్ అయ్యాడని ఇంట్లో గొడవ
- మనస్తాపంతో సూసైడ్ చేసుకునేందుకు పట్టాలపైకి పరిగెత్తిన తండ్రి
- ఆపేందుకు వెళ్లిన కూతురు
- రైలు ఢీకొట్టడంతో ఇద్దరూ మృతి
పాలమూరు, వెలుగు : పచ్చని కుటుంబంలో సెల్ఫోన్ చిచ్చు పెట్టింది. కొడుకు మొబైల్ ఫోన్కు బానిస కాగా, తన భార్య పట్టించుకోకపోవడం వల్లే ఇలా తయారయ్యాడంటూ భర్త ఇంట్లో గొడవ పెట్టుకున్నాడు. కొడుకును మందలించాడు. ఇది చినికి చినికి గాలివానలా మారింది. తర్వాత మనస్తాపం చెందిన తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్లగా అతడిని కాపాడేందుకు కూతురు కూడా వెంటే పరిగెత్తింది. ఈ క్రమంలో రైలు ఢీకొనడంతో ఇద్దరూ చనిపోయారు. ఈ విషాద ఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగోండ సమీపంలో మంగళవారం జరిగింది.
మహబూబ్నగర్రైల్వే ఎస్ఐ సయ్యద్అక్బర్ కథనం ప్రకారం.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్కు చెందిన శివా నంద్ (46)కు భార్య లావణ్య, కూతురు చందన (20), కొడుకు సాయికృష్ణ ఉన్నారు. కొన్నేండ్ల కింద కుటుంబతో కలిసి పాలమూరుకు వచ్చిన శివానంద్ ఏనుగొండ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. ఇక్కడే ఉన్న
ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఓనర్ వద్ద డ్రైవర్గా పని
చేస్తున్నాడు. అదే హాస్పిటల్లో శివానంద్కూతురు చందన ల్యాబ్ టెక్నీషియన్గా పని చేస్తోంది. సాయికృష్ణ ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సాయికృష్ణ సెల్ఫోన్కు అడిక్ట్ అయ్యాడు. ఎప్పుడు సెల్ఫోన్లో గేమ్స్ఆడుతూ ఉండేవాడు. కొడుకు ఎప్పుడూ సెల్ఫోన్ పట్టుకునే కనిపిస్తుండడంతో శివానంద్ తిట్టేవాడు. అయినా సాయి తీరులో మార్పు రాలేదు. సోమవారం కూడా ఇలాగే కనిపించడంతో పట్టించుకోవడం లేదంటూ భార్యను, కొడుకును తిట్టాడు. ఇది పెద్ద గొడవకు దారి తీసింది. దీంతో మనస్తాపంతో అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకునేందుకు శివానంద్సమీపంలోని రైల్వే పట్టాలపైకి వెళ్లాడు.
గమనించిన కూతురు చందన ఆగు నాన్నా అంటూ వెనకే పరిగెత్తింది. అదే టైంలో వచ్చిన అమరావతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టుకుంటూ వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. విషయం భార్యకు తెలియడంతో స్పృహ కోల్పోయింది. దీంతో వెంటనే ఆమెను సమీపంలోని హాస్పిటల్కు తరలించారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.