V6 News

పొలంలో గంజాయి సాగు చేస్తున్న తండ్రీకొడుకు.. 108 గంజాయి మొక్కలు స్వాధీనం

పొలంలో గంజాయి సాగు చేస్తున్న తండ్రీకొడుకు.. 108 గంజాయి మొక్కలు స్వాధీనం

వికారాబాద్, వెలుగు: గంజాయి సాగు చేస్తూ విక్రయిస్తున్న తండ్రీకొడుకుపై తాండూర్​ఎక్సైజ్​పోలీసులు కేసు నమోదు చేశారు. కొడుకును రిమాండ్‎కు పంపినట్లు జిల్లా ఎక్సైజ్​సూపరింటెండెంట్​విజయభాస్కర్ గౌడ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలంలోని బార్వాద్​గ్రామానికి చెందిన ఎర్రోళ్ల పెంటయ్య, అతని కుమారుడు ప్రభాకర్​తమ పొలంలో గంజాయి సాగు చేస్తున్నారు.

పక్కా సమాచారంతో మంగళవారం డీటీఎఫ్, తాండూర్​ ఎక్సైజ్ టీం దాడి చేసి 108 గంజాయి మొక్కలు, కిలోన్నర ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకర్ ను రిమాండ్​కు పంపామని, అతని తండ్రి పరారీలో ఉన్నట్లు జిల్లా ఎక్సైజ్​సూపరింటెండెంట్ పేర్కొన్నారు. డీటీఎఫ్​సీఐ శ్రీనివాస్, తాండూర్ ఇన్​చార్జి సీఐ రాణి, డీటీఎఫ్​ ఎస్సై ప్రేమ్ కుమార్ రెడ్డి, తాండూర్ ఎక్సైజ్ ఎస్సైలు నిజాముద్దీన్, రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

 గంజాయి విక్రేత అరెస్ట్​

 గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని కేపీహెచ్​బీ పోలీసులు అరెస్ట్ చేశారు.  ప్రగతినగర్​ పరిధిలోని రాజీవ్​ గృహకల్పలో నివసించే మహమ్మద్​ ఆరిఫ్ మొబైల్ షాప్​నిర్వహిస్తుంటాడు. బిజినెస్​లో నష్టం రావడంతో ఈజీగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. కొంతకాలంగా మహారాష్ట్రలోని పర్బతి జిల్లాకు చెందిన పుష్ప అనే మహిళ వద్ద తక్కువ ధరకు ఎండు గంజాయి కొనుగోలు చేసి, నగరంలో ఎక్కువ రేటుకు అమ్ముతున్నాడు. అతను కేపీహెచ్​బీ కాలనీ రెండో రోడ్డులోని ఓ హాస్టల్​లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. రూ.16 వేల విలువైన కిలో గంజాయిని స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్​చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

షాపూర్​నగర్‎లో ఒకరు..

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని మేడ్చల్ ఎక్సైజ్​ టాస్క్​ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది. షాపూర్​నగర్​లో మంగళవారం ఎం.అమరేశ్ గంజాయి అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి వెళ్లి అతన్ని పట్టుకున్నారు. 1.50 కిలోల  గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మహారాష్ట్రలోని పర్లి నుంచి తెప్పించినట్లు అమరేశ్​ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్ట్​చేసి, కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.