- రూ.3,540 కోట్ల సేకరించిన చిన్న కంపెనీలు
న్యూఢిల్లీ: స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ల(ఎస్ఎంఈ) ఐపీఓలు సందడి చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 139 చిన్న కంపెనీలు ఎస్ఎంఈ ఐపీఓకి వచ్చి రూ.3,540 కోట్లు సేకరించాయి. కిందటేడాది మొత్తం చూసినా 109 ఎస్ఎంఈ ఐపీఓలే ఇన్వెస్టర్ల ముందుకొచ్చాయి. రూ.1,875 కోట్లు సేకరించాయి. ఫ్యామిలీ ఆఫీసులు, హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ పార్టిసిపేషన్ బాగా పెరిగిందని, దీనికి తోడు మార్కెట్లో సరిపడినంత లిక్విడిటీ ఉందని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడంతో ఫండ్స్ సేకరించడానికి చిన్న కంపెనీలు ఎస్ఎంఈ ఐపీఓల బాట పడుతున్నాయని చెప్పారు.
రానున్న నెలల్లో కూడా ఇలాంటి ట్రెండే కొనసాగుతుందని అంచనా వేశారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 139 ఐపీఓలు ఎస్ఎంఈ సెగ్మెంట్లో వచ్చాయని, మరో రెండు ఎస్ఎంఈ ఐపీఓలు వచ్చే వారం ఓపెన్ కానున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటోమోటివ్ కాంపోనెంట్స్, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అడ్వర్టయిజింగ్, హాస్పిటాలిటీ సెక్టార్లకు చెందిన చిన్న కంపెనీలు ఈ ఏడాది ఎస్ఎంఈ ఐపీఓకి వచ్చాయి. ‘మార్కెట్ పాజిటివ్గా కదలడం కూడా ఎస్ఎంఈ ఐపీఓలు ఎక్కువగా రావడానికి ఒక కారణం. మార్కెట్లో లిక్విడిటీ బాగుంది. బిజినెస్లు విస్తరిస్తున్నాయి. దీంతో కంపెనీలకు డబ్బుల అవసరం ఎక్కువగా ఉంది. ఫండ్స్ సేకరించేకు పబ్లిక్ మార్కెట్ వైపు కంపెనీలు చూస్తున్నాయి’ అని క్లయింట్ అసోసియేట్స్ ఫౌండర్ హిమాన్షు కోహ్లీ అన్నారు.