
ప్రభుత్వం ఏదైనా అవార్డులిస్తే..ఖచ్చితంగా వచ్చి తీసుకోవాలని ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. ఏ స్టేట్ వారైనా సరే..షూటింగ్ లో ఉన్నా..మరెక్కడున్నా..ఈవెంట్ కు వచ్చి అవార్డ్ స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వంతో కలిసి నడవాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీపైన ఉందన్న దిల్ రాజు.. అవార్డ్స్ ఫంక్షన్ ఎప్పుడుందో గుర్తుంచుకుని షూటింగ్ షెడ్యూల్ లో మార్పులు చేసుకుని ఈవెంట్ కు రావాలని సూచించారు. త్వరలో ఏపీలో కూడా అవార్డులు వస్తాయి..వాటిని కూడా బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. రెండు రాష్ట్రాలు ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివని చెప్పారు.
హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన గద్దర్ అవార్డ్స్ వేడుకపై ప్రెస్ మీట్ పెట్టిన దిల్ రాజు.. గద్దర్ అవార్డ్ వేడుకను ప్రభుత్వం గ్రాండ్ గా నిర్వహించిందన్నారు. ఈవెంట్ సక్సెస్ కావడానికి ముఖ్య కారణమైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు స్పెషల్ థ్యాంక్స్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ వెంట్ లో 2:15 నిమిషాలు ఉన్నారని చెప్పారు. సీఎం చేతుల మీదుగా అవార్డులు తీసుకున్న వాళ్లు చాలా హ్యాపీగా ఫీలయ్యారని అన్నారు.
గద్దర్ అవార్డుల ఎంపిక కోసం చాలా విషయాలను పరిగణలోకి తీసుకుని జాగ్రత్త పడ్డామని అన్నారు. గత ఆరు నెలల నుంచి ఈ అవార్డ్స్ కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేసి నిన్న అవార్డ్స్ ఇచ్చామని చెప్పారు. అవార్డ్స్ వేడుకకు వచ్చిన నటీనటులకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు దిల్ రాజు..నిన్నటి ప్రోగ్రామ్ లో చిన్నచిన్న పొరపాట్లు జరిగినట్లు నా దృష్టికి వచ్చింది..కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అవి జరిగాయి..ఎవరైనా హర్టయి ఉంటే క్షమించాలని దిల్ రాజు అన్నారు.
జూన్ 14న హైదరాబాద్ లోని హైటెక్స్ లో గద్దర్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.. 2014 నుంచి 2024 వరకు సినిమాలకు గానూ బెస్ట్ యాక్టర్, డైరెక్టర్, మూవీ, ప్రొడ్యూసర్ నాలుగు కేటగిరీల్లో అవార్డులు అందించారు. పుష్ప2 కి గానూ 2024 బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డును అందించారు సీఎం రేవంత్ రెడ్డి .