న్యూఢిల్లీ:పండగ సీజన్ మొదలవుతోంది కాబట్టి కంపెనీలన్నీ బిజీ అవుతున్నాయి. ఆర్డర్లు, డెలివరీలు పెరుగుతాయి కాబట్టి గిగ్వర్కర్లను, ఫ్రీలాన్సర్లను (టెంపరరీ/కాంట్రాక్టు ఉద్యోగులు) పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి. ఈ సీజన్లో వీరి సంఖ్య 25 శాతం (క్వార్టర్లీ) పెరుగుతుందని ‘వర్క్ యాజ్ఏ సర్వీస్’ ప్లాట్ఫామ్ఎవిన్ తెలిపింది. దాదాపు అన్ని సెక్టార్ల కంపెనీలు గిగ్ వర్కర్ల నియామకాలను మొదలుపెట్టాయని తెలిపింది. ఈసారి గిరాకీ మరింత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, గత ఏడాదితో పోలిస్తే ఈసారి వీరికి డిమాండ్ మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేసింది. గత ఏడాది 1.5 లక్షల మంది వరకు గిగ్వర్కర్ల నియామకం జరిగిందని, ఈసారి ఇది 2.5 లక్షల మందికి వరకు ఉండొచ్చని తెలిపింది. పండగ సీజన్ వచ్చేసింది కాబట్టి కంపెనీల నుంచి గిగ్వర్కర్లకు డిమాండ్ పెరిగింది. మర్చంట్ ఆన్బోర్డింగ్, సెల్లర్ ఆడిట్స్, కేటలాగ్ ఆపరేషన్స్ పెరిగాయి. సీక్వెన్షియల్గా గిగ్వర్కర్ల నియామాలు 25 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎవిన్ తెలిపింది.
‘‘ఈసారి పండగ సమయంలో జనం మరింత ఖర్చు పెడతారన్నది మా అంచనా. పండగలు రావడానికి ముందే కంపెనీలు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నాయి. యాడ్స్ను పెంచాయి. ఆఫర్లను మొదలుపెట్టాయి. కస్టమర్లను ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. అయితే ఈ పనులన్నింటికీ టెంపరరీ కార్మికులు తప్పనిసరిగా కావాలి. అన్ని సెక్టార్ల కంపెనీలూ కార్మికులను తీసుకున్నాయి. గత క్వార్టర్తో పోలిస్తే వీరి సంఖ్య 25 శాతం వరకు పెరగవచ్చు”అని ఎవిన్ సీనియర్ వైస్–ప్రెసిడెండ్ రోహిత్ గుప్తా వివరించారు. డిమాండ్ను బట్టి కంపెనీలు వీరిని నియమించుకుంటున్నాయి. టెక్నాలజీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ కన్సల్టింగ్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), హెల్త్కేర్ ఫార్మాస్యూటికల్స్, బీఎఫ్ఎస్ఐ, తయారీ వంటి రంగాల్లోని కంపెనీలు గిగ్ వర్కర్లను భారీ ఎత్తున నియమించుకుంటున్నాయి. మనదేశంలో ఫ్రీలాన్స్ నిపుణులకు డిమాండ్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. పూర్తిస్థాయి వైట్ కాలర్ జాబ్ మార్కెట్ నెమ్మదించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ‘ఫ్లెక్సింగ్’ అనే గిగ్ ప్లాట్ఫారమ్లో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్ల సంఖ్య జనవరి–-జూన్ కాలంలో వార్షికంగా 25శాతం పెరిగింది. ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ సీఐఈఎల్హెచ్ఆర్ వివిధ సెక్టార్లలోని 400 పెద్ద, మధ్య చిన్న కంపెనీలలో గిగ్ ఎంప్లాయ్మెంట్పై ప్రత్యేకంగా ఒక సర్వే చేసింది. వీటిలో జూన్ క్వార్టర్లో గిగ్ వర్కర్ల నియామకం ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 30శాతం నుంచి 55శాతం పెరిగింది.
గిగ్ వర్కర్లు ఎందుకు పెరుగుతున్నారంటే..
ఈరకం ఉద్యోగాలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారిని రెగ్యులర్ పద్ధతిలో నియమించుకోవడం కంటే తాత్కాలిక పద్ధతిలో గిగ్ వర్కర్ను నియమించుకోవడం ఈజీ అని కంపెనీలు భావిస్తున్నాయి. ఇలాంటి వారిని తీసుకోవడానికి తక్కువ సమయం పడుతుంది. ప్రత్యేకించి ఒడిదుడుకుల సమయంలో లేదా కొత్త వ్యాపార రంగాలలోకి ప్రవేశించేటప్పుడు కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతాయి. "కొత్త నైపుణ్యం కోసం ఉద్యోగులకు కంపెనీలోనే అంతర్గతంగా శిక్షణ ఇవ్వడం కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. ఇందుకు సమయం కూడా ఎక్కువ పడుతుంది. నైపుణ్యం కలిగిన ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్లు ఈ అంతరాన్ని పూడ్చటంలో సహాయపడతారు. వీరిని ఎప్పుడంటే అప్పుడు తీసుకొని పని అయిపోగానే తొలగించవచ్చు" అని ఫ్లెక్సింగ్ ఫౌండర్ చంద్రికా పస్రిచా అన్నారు. సీఐఈఎల్హెచ్ఆర్ సీఈఓ ఆదిత్య నారాయణ్ మిశ్రా మాట్లాడుతూ గిగ్ వర్కర్లకు తక్కువ జీతభత్యాలు చెల్లిస్తే సరిపోతుందని, ముఖ్యంగా కరోనా తరువాత వీరి నియామకాలు పెరిగాయని చెప్పారు. రిమోట్ వర్కింగ్ వల్ల కూడా గిగ్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అంతటా డిజిటలైజేషన్ రావడం వల్ల వీళ్ల నియామకాలు ఎక్కువ అయ్యాయి. భవిష్యత్పై కచ్చితమైన అంచనాకు రాలేనప్పుడు కంపెనీలు పర్మినెంట్ వర్కర్లకు బదులు టెంపరరీ వర్కర్లను నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాయని బ్యాంక్ ఆఫ్ బరో డా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ శబ్నవిస్ అన్నారు.