భువనేశ్వర్: ఏషియన్ గేమ్స్ చాంపియన్ జపాన్ కు ఇండియా హాకీ టీమ్ షాకిచ్చింది. ఎఫ్ఐహెచ్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్ లో మన్ ప్రీత్ సిం గ్ నాయకత్వం లోని టీమిండియా.. జపాన్ ను చిత్తుగా ఓడిస్తూ టైటిల్ ఫైట్ కు దూసుకెళ్లింది. దాంతోపాటు ఈ ఏడాది చివర్లో జరిగే ఎఫ్ఐహెచ్ ఒలింపిక్ క్వాలిఫయర్స్కు కూడా అర్హత సాధించింది.
ఇక్కడి కళింగ స్టేడియంలో శుక్రవారం జరిగిన సెమీఫైనల్లోఇండియా 7–2తో జపాన్ ను చిత్తుగా ఓడించింది.గాయంతో చాన్నాళ్లు ఆటకు దూరమై రీ ఎంట్రీ ఇచ్చిన రమణ్ దీప్ సింగ్ (23, 37వ నిమిషాల్లో)డబుల్ గోల్స్ తో తనదైన శైలిలో విజృంభించగా..హర్మన్ ప్రీత్ సింగ్ (7వ), వరుణ్ కుమార్ (14వ),హార్దిక్ సింగ్ (25వ), గుర్ సాహిబిత్ సింగ్(43వ), వివేక్ సాగర్ ప్రసాద్ (47వ) తలోగోల్తో జట్టుకు ఘనవిజయం కట్టబెట్టారు.జపాన్ తరఫున కెంజికిటాజటో (2వనిమిషం),కొంటా వాటనాబె (20వ)చెరో గోల్ చేశారు. మరో సెమీస్లో 2–1తో అమెరికాను ఓడించిన సౌతాఫ్రికాతో శనివారం జరిగే ఫైనల్లో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది.