మంచిర్యాల శుభ్రత.. ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత

మంచిర్యాల శుభ్రత.. ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత
  •     కార్పొరేషన్​లో స్పెషల్​ డ్రైవ్​ ప్రారంభించిన మేయర్​, కలెక్టర్​ 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలో శానిటేషన్​ మెరుగుపర్చడమే ధ్యేయంగా ‘మంచిర్యాల శుభ్రత- ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత’ పేరిట స్పెషల్​ డ్రైవ్​కు శ్రీకారం చుట్టారు. నస్పూర్​ ఏరియాలోని 32వ డివిజన్​లో మేయర్​ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్​ సల్ల రమ్యలతో కలిసి కలెక్టర్​ కుమార్​ దీపక్​ గురువారం ఈ ప్రోగ్రాంను ప్రారంభించారు. ఈ నెల 5 నుంచి వచ్చే నెల 4 వరకు నెల రోజుల పాటు అన్ని డివిజన్లలో స్పెషల్​ డ్రైవ్​ కొనసాగుతుందని తెలిపారు. 

ఇందులో భాగంగా ఇంటింటా చెత్త సేకరణ, రోడ్లను క్లీన్​ చేయడం, డ్రైనేజీల్లో పేరుకుపోయిన సిల్ట్​ తొలగింపు, రోడ్ల పక్కన పెరిగిన పొదల తొలగింపు, ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు, ప్రభుత్వ సంస్థలను శుభ్రపర్చడం, నీటి నిల్వ ప్రాంతాల తొలగింపు, ప్లాస్టిక్​ వ్యర్థాల సేకరణ, కచ్చా రోడ్ల లెవలింగ్, ఖాళీ స్థలాలను క్లీన్​ చేయడం, గుంతలు పూడ్చివేయడం, కాల్వల రిపేర్లు, వాటర్​ పైప్​లైన్​ లీకేజీ రిపేర్లు, తక్కువ ప్రెషర్​ నల్లా ఫిర్యాదుల పరిష్కారం, ఓవర్​ హెడ్​ ట్యాంకుల క్లీనింగ్, కొత్త నల్లా కనెక్షన్లు ఇవ్వడం, బోర్​వెల్స్​ రిపేర్లు, స్ట్రీట్​ లైట్స్​ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టనున్నారు. కలెక్టర్​ మాట్లాడుతూ పారిశుధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. కార్పొరేషన్​ పరిధిలోని ఫంక్షన్​ హాళ్లు, హాస్పిటళ్లు, వ్యాపార సముదాయాలు, వైన్స్​, బార్ల నిర్వాహకులు శుభ్రత విషయంలో నిబంధనలు  పాటించాలని కోరారు.