రిషి కపూర్ మృతిపై ప్రముఖుల సంతాపం

రిషి కపూర్ మృతిపై ప్రముఖుల సంతాపం

న్యూఢిల్లీ: వెటరన్ యాక్టర్ రిషి కపూర్ (67) మరణంపై సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. రిషి ఆత్మకు శాంతి కలగాలని తలైవా రజనీకాంత్ అన్నారు. ‘నమ్మకలేకపోతున్నా. చింటూ జీ (రిషి కపూర్) ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. మా ఇద్దరి మధ్య పరస్పర ప్రేమ, గౌరవం ఉన్నాయి. నా ఫ్రెండ్ ను నేను మిస్సవుతా. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’ అని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ చెప్పారు. ‘ఇప్పుడే రిషి కపూర్ లేరన్న వార్త విన్నా. గుండె పగిలినట్లుగా ఉంది. ఆయనో లెజెండ్. అద్భుతమైన సహ నటుడు.. అలాగే మంచి ఫ్యామిలీ ఫ్రెండ్’ అని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడు. ‘ఏదో రాయాలని ట్రై చేస్తున్నా. కానీ నా చేతులు, మెదడు సింక్ అవ్వట్లేదు. ఆయన నవ్వు, సెన్సాఫ్​ హ్యూమర్, నిజాయితీ అన్నింటినీ మిస్ అవుతాం’ అని హీరోయిన్ తాప్సీ పేర్కొంది.

సంతాపం తెలిపిన రాహుల్ గాంధీ, కేజ్రీవాల్
‘ఇండియన్ సినిమాకు భయంకరమైన వారం ఇది. రిషి అద్భుతమైన నటుడు. అన్ని జనరేషన్స్ లోనూ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం. రిషిని అందరూ మిస్ అవుతారు. ఆయన కుటుంబానికి, ఫ్రెండ్స్ కు, వరల్డ్ వైడ్ గా ఉన్న ఫ్యాన్స్ కు సంతాపం తెలియజేస్తున్నా’ అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘రిషి కపూర్ ఆకస్మిక మరణ వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యా. ఆయన కెరీర్ ఆసాంతం కొన్ని తరాల పాటు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేశారు. ఆయన ఫ్యామిలీకి సంతాపం తెలియజేస్తున్నా. రిషి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.