సనాతన ధర్మంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తరప్రదేశ్లోని రాంపూర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు సీనియర్ న్యాయవాదులు హర్ష్ గుప్తా , రామ్ సింగ్ లోధి రామ్పూర్లోని కొత్వాలి సివిల్ లైన్స్లో ఫిర్యాదు చేశారు.
2023 సెప్టెంబర్ 4న సనాతన ధర్మానికి సంబంధించి మంత్రి ఉదయ్ నిధి స్టాలిన్ ఉద్వేగభరితమైన ప్రకటన చేశారని న్యాయవాది హర్ష్ గుప్తా తన ఫిర్యాదులో తెలిపారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనా వంటితో పోల్చారని మాట్లాడారు. ఉదయ్ నిధి వ్యాఖ్యలను కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సమర్థించారన్నారు. ఇది హిందూ మతాన్ని విశ్వసించే వారి మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుందని వెల్లడించారు.
ఇద్దరూ తమ ప్రకటనలతో మతపరమైన ఉన్మాదాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రయత్నించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు రాంపూర్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రామ్ సింగ్ లోధీ రాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్కు వాంగ్మూలం ఇచ్చారు. దీనిపై సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై కేసు పెట్టారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 15న జరగనుంది.