
ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో గుల్జార్ హౌస్ ప్రాంతంలో రాజుకున్న అగ్ని మరోసారి ఈ రకం ప్రమాదాలుఎంత భయానకంగా మారతాయో తెలిపింది. ఈ ఘోరం దురదృష్టవశాత్తు జరిగింది కాదు అని వార్తలు చెబుతున్నాయి. అయితే, ఇదే మొదటి ప్రమాదం కాదు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో జరిగిన అనేక అగ్నిప్రమాదాలలో ఇది ఒకటి. పోయిన ప్రాణాల సంఖ్య పెరిగినా తదుపరి తీసుకునే నివారణ చర్యలు ముఖ్యం. అనుభవంతో, అవగాహనతో చేసిన మార్పులు ముఖ్యం.
తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ఆ రోజుకు ఉన్న షాక్, చర్యలు ఆ తరువాత లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాల మీద అగ్నిమాపకశాఖ అధ్యయనం చేసినట్లు దాఖలాలు లేవు. దర్యాప్తు వేరు, అధ్యయనం వేరు. అగ్ని ప్రమాదాల మీద లోతైన పరిశోధన అవసరాన్ని వరుసగా జరుగుతున్న ఘోర ప్రమాదాలు మనకు గుర్తుచేస్తున్నాయి.
గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం వెనుక కారణం తెలుసుకునేందుకు నాలుగు ప్రభుత్వశాఖల అధికారులు వచ్చారు. వారి దగ్గర తగిన పరికరాలు, శాస్త్రీయ పద్ధతులు కానీ కనపడలేదు. సొంత సెల్ ఫోన్లతో ఫొటోలు తీసుకోవడం తప్పితే శాస్త్రీయ పరిశోధనకు అవసరమైన ఆనవాళ్లమీద వారికి ధ్యాస, శిక్షణ, తలంపు ఉన్నట్లు కానరాలేదు.
శాస్త్రీయ పరిజ్ఞానం లేకుండా ఆధునిక అగ్నిప్రమాదం వెనుక కారణాలు విశ్లేషించడం అంత సులభం కాదు. అగ్ని ప్రమాద నివారణ ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది ప్రభుత్వం, సమాజ స్పందన. అగ్నిప్రమాద బాధితులను ఆ మేరకు పలకరించకపోవడం గమనార్హం.
అగ్ని ప్రమాదాలలో సాధారణంగా చెప్పే కారణం బాధితుల బాధ్యత మీదనే కేంద్రీకృతమై ఉంటుంది. ఎక్కువగా నిర్లక్ష్యం, అవగాహన లేమి కారణాలుగా చెబుతారు. కాగా, ప్రభుత్వ బాధ్యత కూడా ఉంటుంది. అగ్ని ప్రమాదాల నివారణకు చట్టాలు, విధి విధానాలు ఉన్నాయి. వాటి అమలు మీద విశ్లేషణ, లోతైన పరిశోధన ప్రభుత్వపరంగా జరగడం లేదు.
మొట్టమొదట ప్రమాదం గురించిన సమాచారం రాగానే అగ్నిమాపక శాఖ స్పందన మీద సమీక్ష జరపాలి. నిందించడానికి కాకుండా, తగిన మార్పులు చేయడానికి ఉపయోగపడుతుంది. అగ్ని నిరోధక పరికరాల పరిమాణం, నాణ్యత, నిర్వహణ చాలా ముఖ్యం.
హైదరాబాద్ నగరం పెరుగుతున్నా అగ్నిమాపక శాఖ కేంద్రాలు, వాహనాలు, పరికరాలు ఆ మేరకు పెరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన ఫైర్ మెన్ (సిబ్బంది) సంఖ్య 1,612 ఉంటే ఖాళీలు 551 ఉన్నాయి. ఈ ఖాళీలను అత్యంత వేగంగా భర్తీ చేయకపోవడం పెద్ద లోపం. అంతస్తులు పెరుగుతున్న మేరకు అగ్నిమాపక సామర్థ్యం పెంచడం లేదు. గేటెడ్ కమ్యూనిటీలు ఇప్పుడు చిన్న పట్టణాలు, పెద్ద ఊర్లను తలపిస్తున్నాయి. ఒక సంఖ్య దాటిన తరువాత అదే ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రానికి వసతి కల్పిస్తే ప్రమాదం వచ్చినప్పుడు సత్వర స్పందన ఉండే అవకాశం ఉన్నది. ఈ తరహా నిబంధన బిల్డింగ్ నిబంధనలలో పెట్టాలి.
బడ్జెట్ కొరత
2025-–26 బడ్జెట్లో కొత్త అగ్నిమాపక కేంద్రాల నిర్మాణానికి కేటాయించిన నిధులు రూ.12 కోట్లు. 2024–-25లో కేటాయించిన రూ.8 కోట్లను తరువాత సవరించి రూ.5.5 కోట్లకు తగ్గించారు. అంతకుముందు 2023–-24లో అయిన ఖర్చు రూ.8.85 కోట్లు. మొత్తం అగ్నిమాపక శాఖకు 2025-26 బడ్జెట్లో కేటాయించిన నిధులు రూ.217.96 కోట్లు, 2024-25లో రూ.198.46 కోట్లు, 2023-24లో అయిన ఖర్చు రూ.180.40 కోట్లు. అగ్నిమాపక శాఖ లెక్కల ప్రకారం 2015-23 మధ్య జరిగిన ఆస్తి నష్టం రూ.1,849.37 కోట్లు. నివారించిన నష్టం రూ.7,636.89 కోట్లు. ప్రాణ, ఆస్తి నష్ట నివారణకు కనీసం రూ.500 కోట్లు ఈ శాఖకు కేటాయించాలి.
అభివృద్ధి, రాష్ట్ర స్థూల ఆదాయం అన్నప్పుడు పక్కనే ఈ తరహా పెట్టుబడి అవసరం అనే సూత్రం ప్రభుత్వం వంటపట్టించుకోవాలి. బాధ్యత లేని అభివృద్ధి మంచిది కాదు. అనేక అగ్ని ప్రమాదాలు నిర్లక్ష్యం వలన జరుగుతున్నాయని అగ్నిమాపక శాఖ కారణం చెబుతుంది. ఈ నిర్లక్ష్యంలో కూడా రకరకాలు.
ప్రభుత్వం ఈ కారణాల నివారణకు చేస్తున్న ప్రయత్నాలు ఏమి ఉన్నాయి? సంబంధిత శాఖలతో కలిసి సమీక్ష చేసి తగు నిర్ణయాలు తీసుకోవాలి. నాసిరకం విద్యుత్ పరికరాలు వాడవద్దు అని ఒక ప్రకటన చేసి ఊరుకుంటున్నారు. నాసి రకం పరికరాలు, నాణ్యత లేని విద్యుత్ పరికరాలు మార్కెట్లో ఉండకుండా చర్యలు చేపట్టాల్సి ఉండగా నెపం ప్రజల మీదకు తోసేయడం సులువుగా కనిపిస్తున్నది.
ప్లాస్టిక్ వస్తువులు, పైబర్ దుస్తులతో ప్రమాదం
మనం ఇండ్లలో, ఆఫీసులలో వాడే ప్లాస్టిక్ వస్తువులు శిలాజ ఇంధనం అయిన ముడి చమురు నుంచి తయారు అవుతాయి కనుక అవి అగ్గికి ఆజ్యంగా పని చేస్తున్నాయి. కొన్ని రకాల కర్టెన్లు, దుస్తులు అయితే క్షణాలలో మంటల్లో కరిగిపోతాయి. మనుషులు ఈ తరహా ఫైబర్ దుస్తులు ధరించి, మంటలు అంటుకుంటే చర్మం దానితోపాటు కరుగుతుంది.
ఇక చర్మం పనికి రాదు. అందుకే ఈ మధ్య అగ్ని ప్రమాదాల బారిన పడిన మహిళలు ఖచ్చితంగా చనిపోతున్నారు. వారు ధరిస్తున్న చీరల ఫైబర్ పాలిస్టర్ కావడం వల్ల అగ్నితో పాటు అది కాలి వారి చర్మం కరిగిపోతోంది. చర్మం లేక, ఇన్ఫెక్షన్లు తట్టుకోలేక చనిపోతున్నారు. ఇండ్లలో వాడుతున్న వస్తువుల నాణ్యత మీద, వాటిని తయారు చేస్తున్న కంపెనీల మీద ప్రమాణాలు కానీ, నియంత్రణ కానీ లేవు. సురక్షితమైన పదార్థాలతో తయారు చేయాలని నిబంధనలు ఉంటే బాగుండేది. ఈ మధ్య ఫైర్ ప్రూఫ్ మెటీరియల్ అని ప్రకటనలు వస్తున్నాయి.
ఫైర్ ప్రూఫ్ అంటే ఆయా వస్తువులను ప్రమాదకరమైన రసాయనాలలో ముంచుతారు. అగ్నిని నిలువరించే ఈ రసాయనాలు దహనాన్ని ఆలస్యం చేయడంలో లేదా నిరోధించడంలో సహాయపడతాయి. అయితే రసాయనాల వాడకం, ఉత్పత్తి వల్ల సంభావ్య ఆరోగ్య, పర్యావరణ సమస్యలు వస్తున్నాయి. అగ్ని ప్రమాదాలలో ప్రాణ నష్టం తగ్గాలంటే ఇండ్లలో వాడే సోఫాలు, కర్టెన్లు, దుప్పట్లు, దుస్తులు వగైరా అన్నింటి గురించి అధ్యయనం చేసి, తగిన ప్రమాణాలు చట్టపరంగా ఏర్పాటుచేసి నియంత్రించాలి.
అగ్నిమాపక కేంద్రాలు పెరగాలి
ఒక ఫ్లాట్ కొనే వ్యక్తి లేదా ఒక పౌరుడు ఒక భవనానికి ఇచ్చిన అగ్నిమాపక అనుమతులను పరిశీలించే అవకాశం ఇవ్వాలి. అగ్ని ప్రమాదాల మీద ప్రజలకు అవగాహన పెంచడంతో పాటు, స్వచ్ఛంద సేవకులకు శిక్షణ కూడా ఇవ్వాల్సిన బాధ్యత అగ్నిమాపక శాఖ మీద ఉన్నది. కళాశాలలు, స్కూళ్లలో నిరంతరంగా, విధిగా విద్యార్థులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
ప్రజల భాగస్వామ్యం అగ్ని ప్రమాద నివారణలో చాలా ముఖ్యం. అగ్నిప్రమాద నివారణకు, నిరోధానికి, సత్వర స్పందనకు స్థానిక ప్రజల సామర్థ్యం, క్షమత పెంచాలి. పోలీసు స్టేషన్ల సంఖ్యకు సమానంగా అగ్నిమాపక కేంద్రాలు పెట్టాలి. అగ్నిమాపక పరికరాలు కూడా విరివిగా ఏర్పాటు చేసేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
అనుమతుల్లోఅవినీతి నివారించాలి
పారిశ్రామిక అగ్నిప్రమాదాల వల్ల గాలి కాలుష్యం కూడా ఉంటుంది. నివాస ప్రాంతాల మధ్య గోడౌన్లు ఉండడం, హోటళ్లు తదితర వాణిజ్య కార్యకలాపాల వల్ల కూడా అగ్నిప్రమాదాల ద్వారా ఆస్తి, ప్రాణనష్టం పెరుగుతున్నది. ఇరుకు సందులలో పెద్ద భవనాలు, విశాల ప్రాంతంలో కట్టిన అపార్ట్మెంట్లలో డిజైన్ పరంగా అనేక అడ్డంకులు ఉండడం వల్ల కూడా అగ్నిమాపక సిబ్బంది తొందరగా చేరుకోలేకపోతున్నారు.
బహుళ అంతస్తు భవనాలలో అగ్నిప్రమాదం జరిగితే, చట్ట ప్రకారం ఉండాల్సిన అగ్నిని ఆర్పే వ్యవస్థ లేకపోతే ఆయా బాధ్యుల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అగ్నిమాపక శాఖ అనుమతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్రింద సరళీకృతం చేశారు. అనుమతులు కూచున్నకాడ తీసుకోవచ్చు. అనుమతులలో అవినీతి ఉంటే ఇంకా ప్రమాణాల అమలు ఎట్లా సాధ్యం? అగ్నిమాపక శాఖ అనుమతులలో పారదర్శకత తీసుకురావాలి.
- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్-