
కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు వెళ్లొస్తుండగా బస్సులో మంటలు చెలరేగాయి. ఒక్క సారిగా బస్సులో మంటలు వ్యాపించడంతో బస్సు నిండా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంలో బస్సు సీట్లన్నీ మంటల్లో కాలిపోవటంతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.
వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో సరస్వతి పుష్కరాలకు వెళ్లి వస్తున్న టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయాన్ని దర్శించుకున్నారు సిరిసిల్లకు చెందిన భక్తులు.
దర్శనం తర్వాత కాళేశ్వరం నుండి సిరిసిల్లాకు తిరుగు ప్రయాణంలో మద్దులపల్లి, అన్నారం మీదుగా ప్రైవేట్ బస్సు వెళ్తున్న సమయంలో ఏసీలో షాక్ సర్క్యుట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంకటరమణ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సమయంలో బస్సులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 36 మంది భక్తులు ఉన్నారు.
ఈ ఘటనలో డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రయాణికులను కిందకి దింపటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సులో సీట్లన్నీ దగ్ధం అయ్యాయి.
కాళేశ్వరం , మద్దులపల్లి దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపుచేశారు సిబ్బంది.