జకోటియా షాపింగ్​ మాల్​లో మళ్లీ మంటలు

జకోటియా షాపింగ్​ మాల్​లో మళ్లీ మంటలు
  • వెంటనే ఆర్పివేసిన అగ్ని మాపక శాఖ
  • గురువారం అర్ధరాత్రి ప్రమాదంలో ఇద్దరు పోలీసులకు  గాయాలు
  • రూ.కోటి పైగానే ఆస్తి నష్టం  

గ్రేటర్​వరంగల్, వెలుగు: వరంగల్​ పోచమ్మ మైదాన్​సెంటర్​లోని జకోటియా షాపింగ్​మాల్​లో గురువారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తేరుకోకముందే శుక్రవారం ఉదయం మళ్లీ మంటలు చెలరేగాయి. గురువారం రాత్రి 7 గంటల సమయంలో జకోటియా షాపింగ్​మాల్​లోని ఎస్​బీఐ  లైఫ్​ఇన్స్యూరెన్స్​లో ష్యార్ట్​ సర్క్యూట్​కారణంగా అగ్ని ప్రమాదం జరగ్గా ఎస్​బీఐ ఉద్యోగులతో పాటు షాపు యజమానులు లోపల చిక్కుకుపోయారు. మట్టెవాడ ఎస్ఐ గోపి, హోమ్​గార్డ్​ ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్లి అద్దాలను పగలగొట్టి వారిని బయటికి తీసుకచ్చారు. ఈ సందర్భంగా వారిద్దరూ గాయపడడంతో వరంగల్​ఎంజీఎం దవాఖానకు తరలించారు.  అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్​ఇంజన్లతో అర్ధరాత్రి వరకు అదుపులోకి తీసుకవచ్చారు. అయితే, శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో మళ్లీ మంటలు చెలరేగగా, వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్​ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో సుమారుగా రూ.కోటి పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఎస్ బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​లోని ఫైల్స్​తో పాటు కంప్యూటర్స్​, ఫర్నిచర్, ఇతర షాపుల్లోని వస్తువులు దగ్ధమయ్యాయి.