ఆగి ఉన్న రైలు బోగీల్లో చెలరేగిన మంటలు

ఆగి ఉన్న రైలు బోగీల్లో చెలరేగిన మంటలు
  •      ఓ బోగీ పూర్తిగా దగ్ధం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ఘటన
  •     ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే జీఎం అరుణ్​కుమార్ ​జైన్

సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​కు సమీపంలో ఆగి ఉన్న ప్యాంట్రీ కార్ కోచ్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన ఫైర్​సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. దాన్ని ఆనుకుని ఉన్న మరో బోగీ పాక్షికంగా తగలబడింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం ఉదయం రెండు ఏసీ ప్యాంట్రీ కార్ బోగీలను వాషింగ్​కోసం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​నుంచి మెట్టుగూడ వద్ద ఉన్న క్లీనింగ్ పిట్​యార్డుకు తీసుకెళ్లారు. 

క్లీనింగ్ పూర్తయ్యాక 11 గంటల ప్రాంతంలో బోగీలను తిరిగి స్టేషన్ కు తరలిస్తుండగా, ఓ ప్యాంట్రీ కార్​బోగీలో   ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ఏరియాను దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గమనించిన స్థానికులు  రైల్వే అధికారులకు, ఫైర్​ స్టేషన్​కు సమాచారం ఇచ్చారు. రైల్వే సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సకాలంలో అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. 

మంటలు చెలరేగిన బోగీ పూర్తిగా దగ్ధమైంది. దాన్ని ఆనుకుని ఉన్న మరో బోగీ స్వల్పంగా దెబ్బతింది. ఆ సమయంలో బోగీల్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​కుమార్​జైన్ పరిశీలించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

కాగా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రతి సూపర్​ఫాస్ట్​ఎక్స్​ప్రెస్​కు ప్యాంట్రీ కార్​కోచ్​లు అటాచ్ అయి ఉంటాయి. అందులో ప్రయాణికులకు అవసరమైన భోజనాలు, టిఫిన్లు, ఇతర  ఆహార పదార్ధాలు తయారుచేస్తారు. ఈ ప్యాంట్రీ కార్​ కోచ్​లలో కుకింగ్​కు పూర్తిగా కరెంటును వినియోగిస్తున్నారు. గురువారం బోగీలను నీటితో కడుగుతున్న సమయంలో షార్ట్​సర్క్యూట్​జరిగి, మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.