
లక్షెట్టిపేట,వెలుగు : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో నిర్వహిస్తున్న హైస్కూల్ తరగతి గదుల్లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. రేకుల షెడ్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి తరగతి గదుల్లోని ఫర్నిచర్ ఆహుతైంది. సెలవు రోజు కావడంతో విద్యార్థులకు ముప్పు తప్పింది. పక్కనే జనావాసాలు ఉండడంతో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి భయపడ్డారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లే జరిగిందా, లేదంటే వేరే కారణం ఏదైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.