తుక్కుగూడలో ఐరన్ లోడ్ లారీపై కాల్పులు

 తుక్కుగూడలో ఐరన్ లోడ్ లారీపై కాల్పులు

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై కాల్పులు కలకలం సృష్టించాయి. కారులో వచ్చిన దుండగులు లారీడ్రైవర్ పై కాల్పులు జరిపారు. నిన్న రాత్రి లారీని..వెంబడిస్తూ వచ్చిన ఓ వ్యక్తి తుక్కుగూడ ఎగ్జిట్ 14దగ్గర రాగానే సడెన్ గా డ్రైవర్ ఒక రౌండ్ కాల్పులు జరిపాడు.  గురి తప్పడంతో లారీ డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.  గన్ ఫైర్ తో లారీ అద్దాలు పగిలిపోయాయి. వెంటనే డయల్ కు కాల్ చేసి సమాచారమిచ్చాడు లారీ డ్రైవర్ మనోజ్. స్పాట్ చేరుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ ఐరన్ లోడ్ తో మెదక్ నుంచి కేరళలోని కొచ్చికి బయల్దేరినట్లు కంప్లైంట్ తెలిపాడు బాధితుడు.

కాల్పుల ఘటన అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేశారు. గతంలోనూ ఔటర్ రింగ్ రోడ్డు పై తమిళనాడు, మధ్యప్రదేశ్ , ఉత్తర్ ప్రదేశ్ లకు చెందిన దోపిడీ దొంగలు హల్ చల్  చేశారు. విలువైన వస్తువులు రవాణా చేసే లారీలు, కంటైనర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. డ్రైవర్లను బెదిరించటం, హతమార్చటం చేస్తున్నారు. ఇటీవలే లారీ టైర్లు, సబ్బులతో వెళ్తున్న లారీలను అడ్డగించి దోచుకున్న ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్ట్  చేశారు. ప్రస్తుత ఘటనకూ ఇవే ముఠాలు కారణం కావచ్చని ఓ పోలీసు అధికారి తెలిపారు. కాల్పుల అనంతరం నిందితుడు వరంగల్  వైపు వెళ్లి పరారై ఉండవచ్చని భావిస్తున్నారు.