దాయాదిపై ఇండియా మండిపాటు
న్యూఢిల్లీ: పుల్వామా ఎటాక్ చార్జిషీట్లో ప్రధాన నిందితుడైన జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్కు ఆశ్రయాన్ని పాకిస్తాన్ కొనసాగిస్తోందని కేంద్రం ఆరోపించింది. ‘అటాక్ జరిగిన 14 ఫిబ్రవరి, 2019 నుంచి ఏడాదిన్నర విచారణ జరిగాక చార్జిషీట్ను ఫైల్ చేశాం. పుల్వామా అటాక్కు తమదే బాధ్యత అని జైషే మహ్మద్ తెలిపింది. సదరు సంస్థ, దాని నాయకత్వం దాయాది పాకిస్తాన్లో ఉంది. విచారకరమైన విషయం ఏంటంటే.. చార్జిషీట్లో ప్రధాన నిందితుడైన మసూద్ అజహర్కు పాక్ ఆశ్రయాన్ని కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి పాక్కు అవసరమైన సాక్ష్యాలను ఇచ్చాం. కానీ పాకిస్తాన్ తన బాధ్యతల నుంచి తప్పించుకుంటోంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చెప్పారు. 2008 ముంబై అటాక్కు సంబంధించి ఆధారాలను ఇచ్చినప్పటికీ పాక్ ఇప్పటిదాకా స్పందించలేదని కేంద్రం మండిపడింది. పుల్వామా అటాక్లో టెర్రరిస్టుల చేతిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఈ దాడికి సంబంధించి ఇండియా రూపొందించిన చార్జిషీట్ను కొంటె యత్నంగా పాక్ తిరస్కరించింది. నమ్మదగిన ఆధారాలను సమర్పించడంలో భారత్ విఫలమైందని చెప్పింది.