విజయనగరం జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. జిల్లాలోని బలిజపేట మండలం చిలకలపల్లికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కరోనాతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తీవ్ర అనారోగ్యం పాలైన వృద్ధురాలు విశాఖలోని విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు గుర్తించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. చికిత్స పొందుతూ ఆ వృద్ధురాలు శనివారం మృతి చెందింది. డాక్టర్లు ఆమె కుటుంబ సభ్యులకు, సెకండరీ కాంటాక్ట్స్ బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకుని కోవిడ్-19 టెస్ట్ చేశారు. వారికి నెగెటివ్ అని తేలిందని మంత్రి వెల్లడించారు. కాగా విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.