
యాదాద్రి భువనగిరి జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు కొట్టుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మత్య్సకారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. వర్షపు నీటిలో చేపలు కొట్టుకుపోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వీరవెల్లి గ్రామంలోని మత్య్సకారులు వలలు బిగించారు. చెరువు అలుగు పోస్తుండటంతో చేపలు కొట్టుకు పోకుండా వారంతా ఎంతో కష్టపడి వానలో తడుస్తూ వలలు కడుతున్నారు. ఏడాది కాలంగా చేపపిల్లలు చెరువులో వదిలామని.. తీరా చేపలు పట్టే సమయంలో భారీ వర్షాలకు చేపలు కొట్టుకుపోవడంతో ఆందోళన చెందుతున్నామని చెప్పారు.
రాష్ట్రంలో వానలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తుండడంతో జనజీవనం అతలాకుతలమవుతున్నది. కొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం కాసేపు తెరిపి ఇచ్చినప్పటికీ మళ్లీ జోరందుకుంది. ఆదివారం వాన వదలడంలేదు. మరో 2 రోజులు వానలు ఇలాగే ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో అందరూ అలర్ట్ అవుతున్నారు.