దళిత మహిళపై దాడి ఘటనలో ఐదుగురు అరెస్టు

దళిత మహిళపై దాడి ఘటనలో ఐదుగురు అరెస్టు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో దళిత మహిళను వివస్ర్తను చేసి, నిర్బంధించి దాడి చేసిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్​చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, కామారెడ్డి డీఎస్పీ ప్రకాశ్​ఆధ్వర్యంలో కేసు ఎంక్వైరీ నడుస్తోందని ఎస్పీ సింధూశర్మ తెలిపారు. మొదట్లో దాడి, బెదిరింపు, బట్టలు విప్పదీయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా, బాధితురాలు కులం పేరుతో కూడా దూషించారని చెప్పడంతో ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద మార్చి డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరిపిస్తున్నామన్నారు.

డీఎస్పీ ప్రకాశ్​కథనం ప్రకారం..బాధితురాలికి మాచారెడ్డి మండలం అక్కాపూర్​కు చెందిన నరేశ్​తో 8 నెలల క్రితం పరిచయం ఏర్పడగా ఇద్దరూ కలిసి రామారెడ్డి మండలంలోని  ఓ ఊరిలో కిరాయికి ఉంటున్నారు. అప్పటికే నరేశ్​కు పెండ్లయ్యింది. ఈ విషయం తెలుసుకున్న నరేశ్​భార్య తరఫు బంధువులైన అక్కాపూర్​కు చెందిన నాగారపు ఎల్లయ్య, భాగ్యలక్ష్మి అలియాస్​బాలలక్ష్మి, లక్ష్మీరావులపల్లికి చెందిన మిల్లర్​ రవి అలియాస్​రెండ్ల రవి, పుట్ట నర్సింహులు, నరేశ్​ భార్య సంధ్య మరికొందరు ఈ నెల 4న వీరి ఇంటికి వచ్చారు.

నరేశ్​ను నిర్బంధించి మహిళ బట్టలు విప్పదీయడంతో పాటు చీపురు కట్టతో కొట్టారు. చంపుతామని బెదిరించారు. కులం పేరుతో దూషించారు. బట్టలు విప్పి కొడుతుండడాన్ని నరేశ్​భార్య ఫోన్​లో రికార్డు చేసింది. బాధితురాలు  గురువారం రామారెడ్డి పీఎస్​లో ఫిర్యాదు చేయడంతో ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. కేసు ఎంక్వైరీ కొనసాగుతోందని, ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉన్నా చర్యలు తీసుకుంటామన్నారు.