నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ సిటీలోని వినాయక్నగర్ ఏరియాలో దంపతులు సుసైడ్ చేసుకున్నారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు. భర్త ఉరేసుకోగా, భార్య విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.
నాలుగో టౌన్ ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మెండోరా మండలం నాగంపేట్కు చెందిన శేషాల నరేశ్(35)కు నిజామాబాద్ నగరం కోటగల్లీకి చెందిన శేషాల మేఘన(30)తో పదేండ్ల కింద వివాహం జరిగింది. వీరికి ఆశిశ్(8), మిథున్(6 ) కొడుకులు ఉన్నారు. ఎన్పీడీసీఎల్ రూరల్ ఈఆర్వో ఆఫీస్లో నరేశ్జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు.
కుటుంబం అంతా వినాయక్నగర్ కాలనీలో ఉంటున్నారు. అయితే ఈ మధ్య నరేశ్ అప్పులు చేసి డిప్రెషన్తో బాధ పడుతున్నాడు. అలాగే అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అప్పుల విషయంలో భార్యతో గొడవలు జరుగుతున్నాయి. తీర్చలేని అప్పులు ఉండడంతో సూసైడ్ చేసుకోవాలని దంపతులు డిసైడయ్యారు. ఇద్దరు పిల్లలను తన సోదరి ఇంటికి పంపిన నరేశ్ఉరేసుకోగా, భార్య మేఘన విషం తాగింది.
కూతురికి ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అనుమానించిన మేఘన తండ్రి బున్ని మోహన్ వచ్చి చూడగా, ఇద్దరు చనిపోయి కనిపించారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎస్సై ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంటున్నామని దంపతులు రాసిన సుసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
