పిల్లిని కాపాడబోయి.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి

  పిల్లిని కాపాడబోయి.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి

పాడుబడిన బావిలో పడిన  పిల్లిని రక్షించడానికి  ఓ కుటుంబంలలోని ఐదుగురు బావిలోకి దూకి మరణించారు. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో  చోటుచేసుకుంది. ముందు బావిలో పడిన పిల్లిని రక్షించడానికి ఒక వ్యక్తి బావిలో దూకగా.. ఆ తరువాత ఒకరు తరువాత మరోకరు బావిలోకి దూకారు.  మొత్తం ఆరుగురు బావిలో దూకగా...  చివరగా తాడు కట్టుకుని దూకిన వ్యక్తిని కాపాడినట్లుగా పోలీసులు తెలిపారు. 

అతనిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా  చికిత్స పొందుతున్నాడు.  అయితే ఆ బావిని బయో గ్యాస్ కు ఉపయోగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.  ఊపిరాడకనే వీరంతా చనిపోయినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.  ఐదుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుంది.  

మృతులను మాణిక్ కాలే (65), మాణిక్ కుమారుడు సందీప్ (36), అనిల్ కాలే (53), అనిల్ కుమారుడు బబ్లూ (28), బాబాసాహెబ్ గైక్వాడ్ (36)గా గుర్తించారు. బయటకు తీసిన వ్యక్తిని మాణిక్ చిన్న కుమారుడు విజయ్ (35)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.