న్యూఢిల్లీ/లక్నో: ఉపఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లోని 6 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో రెండు గెలుపొందగా, ఒక్కొక్కటి బీజేడీ, ఆర్ఎల్డీకి దక్కాయి. లోక్సభ సెగ్మెంట్ను ఎస్పీ దక్కించుకుంది. రాజస్థాన్లోని సర్దార్ షహర్ అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ శర్మ 26,850 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ ను ఓడించారు. చత్తీస్గఢ్లోని భానుప్రతాపూర్ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రి మాండవి.. బీజేపీ క్యాండిడేట్ బ్రహ్మానంద్ నేతమ్పై 21,171 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. బీహార్లో కుర్హానీ స్థానంలో బీజేపీ అభ్యర్థి కేదార్ ప్రసాద్ గుప్తా 3,645 ఓట్ల తేడాతో జేడీ(యూ) అభ్యర్థి మనోజ్ సింగ్ కుష్వాహపై విజయం సాధించారు. ఒడిశాలోని పదంపూర్లో అధికార బీజేడీ అభ్యర్థి బర్షా సింగ్ 42,679 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ప్రదీప్ పురోహిత్పై విజయం సాధించారు.
డింపుల్ యాదవ్ గ్రాండ్ విక్టరీ
ములాయం మరణంతో ఖాళీ అయిన మెయిన్ పురి సెగ్మెంట్లో ఆయన కోడలు డింపుల్ యాదవ్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. 2,88,461 ఓట్ల తేడాతో ఆమె గెలిచారు.
రాంపూర్ సదర్ సెగ్మెంట్లో బీజేపీ గెలుపు
యూపీలోని రాంపూర్ సదర్ అసెంబ్లీ సీటులో బీజేపీ అభ్యర్థి ఆకాష్ సక్సేనా.. ఎస్పీ ప్రత్యర్థిపై విజయం సాధించారు. 33,702 ఓట్ల తేడాతో సక్సేనా గెలిచారు. ఎస్పీ లీడర్ అయిన ఆజంఖాన్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించడం ఇదే తొలిసారి.