
నిర్మల్,వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో ఫ్లెక్సీల పోరు మొదలైంది. ఈసారి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున లోకల్ లీడర్లతో పాటు, హైదరాబాద్లో స్థిరపడ్డ స్థానిక నాయకులు కొందరు టికెట్ఆశిస్తున్నారు. హైకమాండ్తో టచ్లో ఉంటున్న లీడర్లే కాకుండా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ఒకరు టికెట్ రేసులో ఉన్నట్లు తెలిసింది. వీరిలో ఒకరు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కు అనుచరుడు పూర్ణ చందర్ నాయక్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈయన హైదరాబాదులో బిజీగా ఉంటున్నా.. తరచూ ఖానాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తూ పూర్ణన్న యువసేన పేరిట స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పూర్ణన్న యువసేన పేరిట నియోజకరంలోని మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో బీఆర్ఎస్లో కొత్త చర్చ మొదలైంది.
అక్కడక్కడ పెట్టిన ఫ్లెక్సీలలో పూర్ణచంద్ర నాయక్ ఫొటోతో పాటు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవితల ఫొటోలు ఉన్నాయి. ఫ్లెక్సీ, బ్యానర్లలో లోకల్ఎమ్మెల్యే రేఖా నాయక్ ఫొటో కనిపించకపోవడం హాట్టాపిక్గా మారింది. జన్నారం, దస్తురాబాద్, కడెంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ అనుచరులకు మింగుడు పడడంలేదు. ప్రస్తుతం పూర్ణచందర్ నాయక్ ఎంపీ సంతోష్ కుమార్తో కలిసి కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఒకరు ఖానాపూర్ సెగ్మెంట్పై కన్నేసినట్లు తెలిసింది. ప్రస్తుత ఎమ్మెల్యే రేఖానాయక్భర్త శ్యాంనాయక్ కూడా టికెట్ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అసెంబ్లీ టికెట్దక్కకుంటే ఎంపీ స్థానానికి పోటీచేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.