వరదలతో ఈశాన్యం.. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు

వరదలతో ఈశాన్యం.. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు
  • ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు
  • మణిపూర్ లో 883 ఇండ్లు డ్యామేజ్
  • 64 పశువులు మృతి, త్రిపురలో ఒకరు
  • 5 రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్
  • అన్ని విధాలా సాయం చేస్తామని హామీ

గువహటి/ ఇంఫాల్/ అగర్తల: ఈశాన్య రాష్ట్రాలు గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు, వరదలతో అతలకుతలం అవుతున్నాయి. అస్సాంలో ఇప్పటివరకూ కొండచరియలు విరిగిపడి 8 మంది చనిపోయారు. రాష్ట్రంలో బ్రహ్మపుత్ర సహా ఇతర నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. 15 జిల్లాల్లో 78 వేల మంది వరద ప్రభావానికి గురయ్యారు. పలు జిల్లాల్లో నేషనల్ హైవేలు కోతకు గురై రాకపోకలు ఆగిపోయాయి. దీంతో వాహనాల రాకపోకలకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. అలాగే, రైల్వే కనెక్టివిటీ కూడా దెబ్బతిన్నది. పలు చోట్ల రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయి. దీంతో వివిధ మార్గాల్లో రైలు సర్వీసులను రెండు రోజుల పాటు రద్దు చేశారు. నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తూ వరదలకు దారి తీస్తుండడంతో సెంట్రల్  వాటర్  కమిషన్  (సీడబ్ల్యూసీ) ‘ఆరెంజ్  బులెటిన్’ విడుదల చేసింది.  జోర్హాట్– మాజులి మార్గంలో ఫెర్రీ సర్వీసులను నిలిపివేశారు. బ్రహ్మపుత్రతో పాటు ధలేశ్వరి, రుక్నీ, కటఖల్, బారక్, బురిదేహింగ్, కుషియారా, ధనసిరి, కొపిలి నదులు డేంజర్  మార్కును దాటి ప్రవహిస్తున్నాయని సీడబ్ల్యూసీ తెలిపింది. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్  బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కాగా.. అస్సాం, అరుణాచల్  ప్రదేశ్  బార్డర్ లోని తిన్సుకియా జిల్లాలో బోమ్ జిర్  నది ప్రమాదకరంగా ప్రవహించడంతో 14 మంది చిక్కుకుపోయారు. వారిని ఇండియన్  ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) బలగాలు రక్షించాయి.

త్రిపురలో ఒకరు మృతి

త్రిపురలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. అగర్తలతో పాటు చాలా చోట్ల వరదలు సంభవించాయి. శనివారం మూడు గంటల్లోనే అగర్తలలో 20 సెం.మీ. వర్షం కురిసింది. జనజీవనం స్తంభించింది. రోడ్లపై మోకాలి లోతు నీరు చేరింది. అగర్తలలో మ్యాన్ హోల్​లో పడి ఒకరు చనిపోయారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. ప్రమాదకర, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా.. తాజా పరిస్థితిపై అస్సాం, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్  చేసి మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సీఎంలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సాయం అందించేందుకైనా సిద్ధంగా ఉన్నామని అమిత్ షా హామీ ఇచ్చారు.

మణిపూర్​లో వరదల బీభత్సం

మణిపూర్​లో వరదలు బీభత్సం సృష్టించాయి. శుక్ర, శనివారం కురిసిన భారీ వర్షాలు, కొండచరియలకు 883 ఇండ్లు డ్యామేజ్ అయ్యాయి. వాటిలో కొన్ని ఇండ్లు కూలిపోయాయి. ఇంఫాల్ సహా పలు జిల్లాలు నీట మునిగాయి. ఇంఫాల్  ఈస్ట్​లో 800 మందిని అస్సాం రైఫిల్స్  బలగాలు రక్షించాయి. గవర్నర్  అజయ్  కుమార్  భల్లా ఆదివారం ఇంఫాల్​లో పర్యటించారు. వరద బాధితులకు సాయం చేయాలని, వారికి అండగా ఉండాలని సీఎస్ పీకే  సింగ్​ను గవర్నర్ ఆదేశించారు. ఇక, వరదలకు పలు చోట్ల 64 పశువులు చనిపోయా యి. ఓ వ్యక్తి కూడా మృతి చెందాడు.