
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఆయిల్ పామ్ సాగుతో అధికలాభాలు సాధించవచ్చని , 30 ఏండ్ల పాటు దిగుబడి వస్తుందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. రైతులు సంప్రదాయ పంటలకు బదులుగా అధికలాభాలు అందించే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. మంగళవారం కొంగరకలాన్లోని కలెక్టరేట్ లో జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ, వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన, శిక్షణ సదస్సు జరిగింది.
ముందుగా ఆయిల్ పామ్ స్టాళ్లను ప్రారంభించి పాంప్లెట్లను విడుదల చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో 5,500 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా వచ్చే లాభాలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ, ఆసక్తి అనుకూల పరిస్థితులు కలిగిన రైతులు సాగు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు.
ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తూ రాయితీలను అందిస్తుందని, ఉద్యానవన శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సునందారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి, ఆయిల్ కంపెనీ ప్రతినిధులు బీఎన్ రావు, రఘు,ప్రీతి, రైతులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.