
- 17 జిల్లాల్లో 15 డిగ్రీల్లోపు రాత్రి ఉష్ణోగ్రతలు
- అత్యల్పంగా కుమ్రంభీంజిల్లాలో 10.7 డిగ్రీలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్నది. సోమవారం రాత్రి పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు చల్లటి గాలులు, పొగమంచు కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 13 జిల్లాలకు పొగ మంచు ముప్పు ఉందని వాతావరణ శాఖ మంగళవారం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి
మెదక్ జిల్లాల్లో బుధవారం పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో చాలా చోట్ల మంగళవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మబ్బులు పట్టి చలిగాలులు వీచాయి. బుధవారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్ సిటీ అంతటా 20 డిగ్రీల్లోపే..
రాష్ట్రంలో సోమవారం 17 జిల్లాల్లో 15 డిగ్రీల్లోపు రాత్రి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్లో 10.7 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్లో 11.8, నిర్మల్లో 12.2, సిద్దిపేటలో 12.6, రాజన్న సిరిసిల్లలో 13.7, జగిత్యాలలో 13.8, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లిల్లో 13.9, మంచిర్యాలలో 14.1, నిజామాబాద్లో 14.4, ములుగులో 14.6, కామారెడ్డిలో 14.7, జనగామ, మెదక్లో 14.8, వికారాబాద్ 14.9, యాదాద్రి భువనగిరి
వరంగల్ జిల్లాల్లో 15 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగితా జిల్లాల్లో 15 నుంచి 19 డిగ్రీల మధ్య రాత్రి టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో అత్యల్పంగా 16.4 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిటీ అంతటా 20 డిగ్రీల కన్నా తక్కువగానే రాత్రి టెంపరేచర్లు రికార్డయ్యాయి.