ఐదోసారి..ప్రధాని ప్రోగ్రామ్​కు కేసీఆర్​ మళ్లా దూరం

ఐదోసారి..ప్రధాని ప్రోగ్రామ్​కు కేసీఆర్​ మళ్లా దూరం

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనకు సీఎం కేసీఆర్​వరుసగా ఐదోసారి డుమ్మా కొట్టారు. ప్రగతి భవన్​లోనే ఉండి కూడా ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లలేదు. సికింద్రాబాద్​ నుంచి తిరుపతికి నడిచే వందే భారత్​రైలు ప్రారంభోత్సవం, సికింద్రాబాద్ ​రైల్వే స్టేషన్​ మోడ్రనైజేషన్, బీబీ నగర్​ఎయిమ్స్​లో అదనపు భవనాల నిర్మాణాలు, రూ. 7 వేల కోట్లకు పైగా నిధులతో చేపడుతున్న నేషనల్ ​హైవేస్​ నిర్మాణానికి భూమిపూజ చేసే కార్యక్రమాల్లో పాలుపంచుకోలేదు. శనివారం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి చెన్నై వెళ్లిన ప్రధానికి.. తమిళనాడు సీఎం స్టాలిన్​ మాత్రం స్వాగతం పలికి అక్కడి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.

నిరుడు రాష్ట్రానికి ప్రధాని మోడీ నాలుగుసార్లు వచ్చినా ఎప్పుడూ కేసీఆర్​ వెళ్లి ఆహ్వానం పలుకలేదు. 2022 ఫిబ్రవరి 5న ముచ్చింతల్​లో సమతామూర్తి విగ్రహావిష్కరణకు మోడీ హైదరాబాద్​కు వచ్చారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లకు కోసం రెండు వారాల ముందే ముచ్చింతల్​లోని చినజీయర్​ ఆశ్రమానికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించిన కేసీఆర్​ తీరా విగ్రహావిష్కరణ టైం వచ్చేసరికి జీయర్​తో విభేదించారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వంపైనా కేసీఆర్​ విమర్శలు చేస్తూ వచ్చారు. రాజకీయ విభేదాలతోనే ప్రధానికి కేసీఆర్​ఆహ్వానం పలుకలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. మే 26న ఐఎస్​బీ కాన్వొకేషన్​కు మోడీ చీఫ్​ గెస్ట్​గా వస్తే కేసీఆర్​జేడీఎస్​నేతలతో చర్చలు జరిపేందుకు బెంగళూరుకు వెళ్లారు. హైదరాబాద్​ టూర్​అనంతరం మోడీ చెన్నై పర్యటనకు వెళ్తే ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్​ ఘన స్వాగతం పలికారు. 

జులై ఒకటి నుంచి మూడో తేదీ వరకు హైదరాబాద్​లో నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ వచ్చారు. రెండు, మూడో తేదీల్లో ఆయన హైదరాబాద్​లోనే ఉన్నారు. అప్పుడూ ఆయనను కేసీఆర్ ఆహ్వానించలేదు. అదే టైంలో ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్​సిన్హా పరిచయం పేరుతో అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించి, అదే వేదికపై మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నవంబర్​12న రామగుండం ఆర్ఎఫ్​సీఎల్​ ప్రారంభోత్సవానికి మోడీ రాష్ట్రానికి వచ్చారు. పలు నేషనల్​ హైవేస్​కు ఆ సమయంలో శంకుస్థాపన చేశారు. కేసీఆర్ ప్రగతి భవన్​లోనే ఉండి కూడా ప్రధానిని రిసీవ్​ చేసుకోలేదు. అదే రోజు సాయంత్రం ప్రధాని వైజాగ్ ​వెళ్లారు. ఏపీ సీఎం జగన్​ ప్రధానికి ఆహ్వానం పలికి తమ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరారు.