పదవులు..మాకెప్పుడు..!

పదవులు..మాకెప్పుడు..!
  •     నామినేటెడ్ పోస్టులు దక్కని నేతల అసహనం
  •     ఇంకా పదుల సంఖ్యలో ఆశావహులు 
  •     రాష్ట్ర, జిల్లా స్థాయి పదవుల కోసం ప్రయత్నాలు
  •     కోడ్​అమలులోకి రావడంతో తప్పని ఎదురుచూపులు

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో నామినేటెడ్​ పదవులపై ఆశలు పెట్టుకున్న లీడర్లకు మళ్లీ ఎదురుచూపులు తప్పడం లేదు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్​అధికారంలోకి రావడంతో తమకు ఏదో ఒక పదవి దక్కుతుందని చాలా మంది ఆశపడ్డారు. దాదాపు మూడు నెలల నుంచి తమ గాడ్​ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కొందరు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు కోరుకోగా

ఇంకొందరు జిల్లా స్థాయి పోస్టులపై కన్నేశారు. మార్కెట్ కమిటీ, అర్బన్​డెవలప్​మెంట్ అథారిటీల నుంచి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కోరుకున్నారు. అయితే, తాజాగా కొన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయగా ఇప్పటివరకు పదవులు కోరుకుంటున్న కాంగ్రెస్​ నేతల్లో కొందరినే వరించాయి. వైరాకు చెందిన నాయుడు సత్యనారాయణకు హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్, నూతి శ్రీకాంత్ కు బీసీ ఫైనాన్స్​కార్పొరేషన్ చైర్మన్​పదవి లభించింది.

వీరిద్దరూ వైరాకు చెందిన వారైనా హైదరాబాద్​లో స్థిరపడి అక్కడి పాలిటిక్స్​లో ఉన్నారు. ఇక సత్తుపల్లికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్​మువ్వా విజయ్​బాబుకు విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్​గా, పాలేరుకు చెందిన రాయల నాగేశ్వరరావుకు గిడ్డంగుల సంస్థ చైర్మన్​గా, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్​గా పదవులు దక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా 37 మందిని నామినేటెడ్​పోస్టుల్లో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా,

అందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురికి రాష్ట్ర స్థాయి పదవులు దక్కాయి. ఇంకా పదుల సంఖ్యలో కాంగ్రెస్​ సీనియర్​నేతలు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్​లోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేసిన లీడర్లు, జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అనుచరులు పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. పదవులు ఆశిస్తున్న వారిలో జిల్లా కాంగ్రెస్​అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్​, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరులు సాధు రమేశ్​రెడ్డి, కమర్తపు మురళి,

రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అనుచరుడు బొర్రా రాజశేఖర్​ఉన్నారు. పలువురు సీనియర్​నేతలు, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, ఖమ్మం నగర కాంగ్రెస్​ అధ్యక్షుడు మహ్మద్​జావేద్, పీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాస్​రెడ్డి, నాగ సీతారాములు, మిక్కిలినేని నరేంద్ర, విజయాబాయి తదితరుల్లో కొందరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని, మరికొందరు ఏదో ఒక పదవి వస్తుందని ఆశపడుతున్నారు. వీరే కాకుండా నియోజకవర్గ స్థాయి నాయకులు చాలా మంది మార్కెట్ కమిటీలు, ఆలయ చైర్మన్ల పదవులు, ఇతర మండల స్థాయి పదవులు కోరుకుంటున్నారు. 

మూడు నెలలుగా పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సంతోషంలో తమకు పదవులు వస్తాయని ఊహల్లో ఉన్న నేతలు ఇప్పుడు పదవి దక్కకపోవడం, ఎన్నికల కోడ్​అమలులోకి రావడంతో మళ్లీ మూడు నెలలు ఎదురుచూడాల్సి వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరుసగా సర్పంచ్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, ఇంకెప్పుడు తమకు న్యాయం జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం కష్టపడ్డామని, మళ్లీ ఎన్నికల్లో తమతో పనిచేయించుకుంటూ పదవులు మాత్రం ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.