- మనదేశంలో బిజినెస్ కష్టమంటున్న విదేశీ బ్యాంకులు
- రిటైల్ బిజినెస్లను బంద్ చేస్తున్నయ్
- లాభాలు తక్కువ ..ఖర్చులెక్కువ
- విపరీతమైన రూల్స్తో ఇక్కట్లు
బిజినెస్ డెస్క్, వెలుగు: గ్లోబల్ బ్యాంకులు ఇండియాలో రిటైల్ బిజినెస్ చేయడానికి ఇష్టపడడం లేదు. రూల్స్ కఠినంగా ఉండడంతో పాటు, ప్రాఫిట్స్ రాకపోతుండడంతో తమ లోకల్ బిజినెస్లను క్లోజ్ చేసుకుంటున్నాయి. గత పదేళ్లలో చాలా మల్టీ నేషనల్(ఎంఎన్సీ) బ్యాంకులు ఇండియాలో తమ బిజినెస్లను క్లోజ్ చేసుకున్నాయి. తమ క్రెడిట్ కార్డు బిజినెస్ లేదా వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ లేకపోతే తమ మొత్తం రిటైల్ బిజినెస్ను ఇతర కంపెనీలకు అమ్మేసి ఇక్కడ దుకాణం సర్దేశాయి. తాజాగా సిటీ బ్యాంక్ ఇండియా, చైనాతో పాటు 13 దేశాల్లో తమ రిటైల్ బిజినెస్ను క్లోజ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇండియన్ బ్యాంకింగ్ మార్కెట్లో గ్లోబల్ బ్యాంకుల వాటా చాలా తక్కువ. దీంతో పాటు బ్యాంకింగ్ సేవలను మరింత విస్తరించడానికి రూ. కోట్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. లోకల్ బిజినెస్ ప్రాఫిట్బుల్ కాదని ఎంఎన్సీ బ్యాంకులు అభిప్రాయపడుతున్నాయి. గత 20 ఏళ్లలో ఇలా చాలా ఎంఎన్సీ బ్యాంకులు ఇండియా నుంచి వెళ్లిపోయాయి.
ఈ బ్యాంకులు నిలవలేకపోయాయ్..
బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇండియా రిటైల్ బిజినెస్ నుంచి 1998 లో ఎగ్జిట్ అయ్యింది. తన లోకల్ బిజినెస్ను డచ్ బ్యాంక్ అయిన ఏబీఎన్ ఆమ్రోకి అమ్మేసింది. ఏబీఎన్ ఆమ్రో కూడా ఇండియాలో కొనసాగలేకపోయింది. ఈ సంస్థ 2007 లో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్(ఆర్బీఎస్) కు తన రిటైల్ బిజినెస్ను సేల్ చేసింది. ఆర్బీఎస్ బ్యాంకు కూడా 2013 లో తమ రిటైల్ బిజినెస్ను మూసేసింది. ఒకప్పుడు దేశంలో అతిపెద్ద ఫారిన్ బ్యాంక్గా ఉన్న ఏఎన్జెడ్ గ్రిండ్లేస్, ఇండియాలో తన బిజినెస్ను కొనసాగించలేకపోయింది. తన వ్యాపారాన్ని స్టాండర్డ్ ఛార్టర్డ్కు 2000 లో విక్రయించింది. గత పదేళ్లలో జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్, బ్రిటిష్ బ్యాంక్ బార్క్లేస్ ఇండియాలో తమ రిటైల్ బిజినెస్లను క్లోజ్ చేసుకున్నాయి. స్విస్ బ్యాంక్ యూబీఎస్, యూఎస్ బ్యాంకులు మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మ్యాన్ శాక్స్ లు తమ రిటైల్ బిజినెస్ లైసెన్స్లను వదులుకున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా–మెరిల్ లించ్ , డచ్ బ్యాంకింగ్ గ్రూప్ ఐఎన్జీ తమ వెల్త్ మేనేజ్మెంట్ వంటి బిజినెస్లను ఇతర కంపెనీలకు అమ్మేశాయి. మరోవైపు డీబీఎస్ వంటి బ్యాంకులు దేశంలో తమ బిజినెస్లను విస్తరిస్తున్నాయని బ్యాంకింగ్ ఎక్స్పర్టులు చెబుతున్నారు.
రిటైల్ బిజినెస్తో లాభం లేదు
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లా కాకుండా రిటైల్ బ్యాంకింగ్ వేరుగా ఉంటుంది. ఈ సెగ్మెంట్లో లోకల్ బ్యాంకులను కస్టమర్లు ఎక్కువగా ఆదరిస్తున్నారు. రిటైల్ బ్యాంకింగ్లో దేశీయ బ్యాంకులే ముందుంటున్నాయని ఏపీఏసీ ఫైనాన్షియల్ ఫౌండర్ గునిత్ చదా అన్నారు. ఏ దేశంలో చూసుకున్న రిటైల్ బ్యాంకింగ్లో టాప్ 5 స్థానాల్లో లోకల్ బ్యాంకులుంటున్నాయని చెప్పారు. నెంబర్ 5 నుంచి 10 పొజిషన్ల కోసం ఎంఎన్సీ బ్యాంకులు పోటీ పడుతుంటాయని అన్నారు. దేశంలో రెగ్యులేషన్స్, స్క్రూటినీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఏ ఎంఎన్సీ బ్యాంక్ కూడా రెగ్యులేషన్స్ కారణాలతో తమ బిజినెస్లను క్లోజ్ చేసుకోలేదని గునిత్ అభిప్రాయపడ్డారు. ‘ఇతర ఎమెర్జింగ్ మార్కెట్ల మాదిరే ఇండియాలో కూడా రెగ్యులేషన్స్ ఉన్నాయి. చాలా ఎంఎన్సీ బ్యాంకులు లోకల్ బిజినెస్ల వల్ల లాభపడ్డాయి కూడా. దీంతో రెగ్యులేషన్స్ లోకల్ బ్యాంకులకు, గ్లోబల్ బ్యాంకులకు సపోర్ట్ చేసేలా ఉన్నాయని తెలుస్తోంది’ అని చెప్పారు. ‘ ఫిన్టెక్ ఇండస్ట్రీ విస్తరిస్తుండడంతో కస్టమర్లను కాపాడుకోవడానికి కొత్త టెక్నాలజీలలో ఇన్వెస్ట్ చేయక తప్పదనే విషయాన్ని బ్యాంకులు గుర్తించాయి. మరోవైపు దేశంలో బ్యాంకులపై స్క్రూటినీ ఎక్కువగా ఉంటుంది. అనేక రెగ్యులేషన్స్ను ఫాలో కావాల్సి ఉంటుంది. బ్యాంకులు తమ లోకల్ బిజినెస్లను కొనసాగించడానికి మరింతంగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తోంది’ అని పైన్ ల్యాబ్స్ సీఈఓ అమ్రిష్ రావ్ అన్నారు.