కోల్ కతా: ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ప్రాయోజిత స్కూళ్లలో 26 వేల ఉద్యోగాలు రద్దు చేయాలని కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కలకత్తా హైకోర్టును కూడా బీజేపీ కొన్నదని ఆమె ఆరోపించారు. ‘‘వారు (బీజేపీ నేతలు) అంతకుముందు సీబీఐని కొన్నారు. ఎన్ఐఏను కొన్నారు. బీఎస్ఎఫ్ను కొన్నారు. ఇప్పుడు కలకత్తా హైకోర్టును కూడా కొనుగోలు చేశారు. అలాగే దూరదర్శన్ లోగోను కూడా కాషాయ రంగులోకి మార్చారు.
ఇప్పుడు ఆ చానెళ్లలో బీజేపీ, మోదీ గురించే ప్రచారం చేస్తారు. ఆ కార్యక్రమాలను ప్రజలు చూడరాదు. వాటిని బాయ్ కాట్ చేయాలి” అని మమత ట్వీట్ చేశారు. ఉద్యోగాల రద్దు నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంకు టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఒక్క ఓటు కూడా వేయరాదని ఆమె కోరారు. కాగా, 26 వేల ఉద్యోగాలను రద్దుచేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.