దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. కర్ణాటకలోని 14 లోక్సభ నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ బూత్ లు ఓపెన్ చేయగా.. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. వారిలో కొందరు సెలబ్రెటీలు కూడా ఉన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఐకాన్ ఎన్ఆర్ నారాయణ మూర్తి, ఆయన భార్య, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి, మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, నటుడు ప్రకాష్ రాజ్ వారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.
ఎక్కడెక్కడంటే..
లోక్ సభ రెండవ దశ ఎన్నికలు ప్రారంభమైయ్యాయి. ఇందులో 15.88 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మంది పురుషులు, 5,929 మంది థర్డ్ జండర్లు ఉన్నారు. ఈ దశలో 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ సహా కేరళలో 20 స్థానాలు, కర్ణాటకలోని 28 స్థానాల్లో 14 స్థానాలకు, రాజస్థాన్లో 8 సీట్లు, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 7, అస్సాంలో 5, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 3, పశ్చిమ బెంగాల్లో 3 స్థానాలకు, మణిపూర్, త్రిపుర, జమ్ము కశ్మీర్లో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరుతున్నాయి.
రెండు దశ బరిలో ఉన్న ప్రముఖులు వీరే
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, శశి థరూర్, కేసీ వేణుగోపాల్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, అరుణ్ గోవిల్ (రామాయణం సీరియల్ రాముడి పాత్రధారి), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, నటి హేమమాలిని, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర ప్రముఖులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.