
- దట్టమైన అడవులను నరికివేసి పోడు వ్యవసాయం
- ఖాళీ చేయించి తిరిగి మొక్కలు నాటే ప్రయత్నంలో అటవీఅధికారులు
- ఆక్రమిత భూముల్లోకి వెళ్తే గొత్తికోయల దాడులు
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల్లో యుద్ధవాతావరణం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ఛత్తీస్గఢ్నుంచి బతుకుదెరువు కోసం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అడవుల్లోకి వచ్చిన గొత్తికోయలు ఏకంగా 26 వేల 688 ఎకరాల ఫారెస్ట్ భూములను ఆక్రమించినట్లు తాజాగా అటవీశాఖ తేల్చింది. కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ డివిజన్ల పరిధిలో దట్టమైన అడవులను ఆక్రమించిన గొత్తికోయలు.. చెట్లు నరికి పోడు వ్యవసాయం చేస్తున్నట్లు గుర్తించిన అటవీ అధికారులు, వారిని వెనక్కి పంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఆయా అడవుల్లో చెట్ల నరికివేతపై సీరియస్గా ఉన్న అటవీశాఖ ఉన్నతాధికారులు, మొక్కలు నాటి అడవులను పునరుద్ధరించాలని ఆదేశిస్తుండడం, ఇందుకోసం ఆక్రమిత భూముల్లోకి వెళ్తున్న ఫారెస్ట్ సిబ్బందిపై గొత్తికోయలు దాడులకు తెగబడ్తుండడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడవుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.
3,653 కుటుంబాల చేతిలో 26,688 ఎకరాలు..
ఛత్తీస్గఢ్నుంచి వలస వచ్చిన గొత్తికోయలు రిజర్వ్ ఫారెస్ట్లో నివాసాలు ఏర్పాటు చేసుకొని, పోడు చేసుకుంటున్న ప్రాంతాల్లో ఇటీవల అటవీ అధికారులు సర్వే నిర్వహించారు. కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ డివిజన్ల పరిధిలో నిర్వహించిన ఈ ప్రాథమిక సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. మొత్తం 123 హ్యాబిటేషన్ల పరిధిలో 3,653 కుటుంబాలు 26,688.50 ఫారెస్ట్ భూమిని ఆక్రమించినట్లు ఆఫీసర్లు తేల్చారు.
కొన్నేండ్లుగా ఛత్తీస్గఢ్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా పెద్దసంఖ్యలో గుత్తికోయలు బతుకుదెరువు కోసం సరిహద్దున ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అటవీ ప్రాంతాలకు వలస వస్తున్నారు. అడవుల్లో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకొని అక్కడి చెట్లను నరికి వేసి, పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. వీరి వల్ల దట్టమైన అటవీ ప్రాంతాలన్నీ పలుచబడి పోయాయి. ఆయా ప్రాంతాల్లో హరితహారం కింద మొక్కలు నాటి అడవిని పునరుద్ధరించాలని జిల్లా ఫారెస్ట్ సిబ్బందికి ఆఫీసర్లు టార్గెట్లు పెడ్తున్నారు.
దీంతో ఆక్రమిత భూముల్లోకి వెళ్తున్న సిబ్బందిపై గొత్తికోయలు దాడులకు తెగబడ్తున్నారు. రెండేండ్ల కింద చంద్రుగొండ మండలంలో జరిగిన గొడవలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావును గొత్తికోయలు హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో చుంచుపల్లి మండలంలో పలు హ్యాబిటేషన్లలో సర్వేకు వెళ్లిన ఫారెస్ట్ సిబ్బందిపైనా దాడులు జరిగాయి. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు అటు వైపు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.
శాఖల మధ్య సమన్వయ లోపం!
గొత్తికోయల విషయంలో ఫారెస్ట్, పోలీస్, ఐటీడీఏ, ఇతర శాఖల మధ్య కో ఆర్డినేషన్ లేకుండా పోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు గొత్తికోయలను ఖాళీ చేయించాలని అటవీ అధికారులు ప్రయత్నిస్తుండగా, మరోవైపు స్థానిక పోలీసులు, ఐటీడీఏ, ఇతర శాఖల అధికారులు గొత్తికోయలకు సరుకులు, సోలార్ లైట్లు, బోర్లు, ఇతర పరికరాలు అందజేస్తున్నారు. వారికి రేషన్కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు కూడా ఇస్తుండడం, హ్యాబిటేషన్లలో మౌలికవసతులు కూడా కల్పిస్తుండడంతో వారిని ఛత్తీస్గఢ్కు తిప్పిపంపడం కష్టమవుతోందని అటవీ అధికారులు చెప్తున్నారు.
పోలీసులు, ఇతర అధికారుల సహకారం వల్లే గొత్తికోయలు తమపై తిరగబడ్తున్నారని, అందువల్లే తాము టార్గెట్చేరుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఈ విషయంలో మిగిలిన శాఖలు తమకు సహకరిస్తేనే ఆక్రమిత భూమి స్వాధీనం చేసుకొని అడవులను పునరుద్ధరించే అవకాశముంటుందని స్పష్టంచేస్తున్నారు
ఫారెస్ట్ ల్యాండ్ను స్వాధీనం చేసుకుంటాం..
గొత్తికోయలకు అవగాహన కల్పించి, ఆక్రమణలో ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ను స్వాధీనం చేసుకుంటాం. ఫారెస్ట్ భూమి ఆక్రమిస్తే చట్టపరంగా ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరిస్తాం. పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సహకరించాలి – కోటేశ్వరరావు, ఎఫ్డీవో, కొత్తగూడెం
డివిజన్ల వారీగా ఆక్రమణకు గురైన ఫారెస్ట్ భూమి..
డివిజన్ హ్యాబిటేషన్లు కుటుంబాలు ఆక్రమణ(ఎకరాల్లో..)
కొత్తగూడెం 08 267 1631.25
ఇల్లెందు 02 29 198
పాల్వంచ 33 970 15030.13
మణుగూరు 29 877 3,011.63
భద్రాచలం 25 960 6,268.29
కిన్నెరసాని వైల్డ్ లైఫ్ 26 550 549.20
మొత్తం 123 3,653 26,688.50