
హైదరాబాద్: హెచ్సీఏ నిధుల దుర్వినియోగం కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్తో పాటు నలుగురిని అరెస్ట్ చేశారు. ట్రెజరర్ శ్రీనివాసరావు, జనరల్ సెక్రెటరీ రాజేంద్ర యాదవ్, HCA CEO సునీల్ కంటేతో పాటు రాజేంద్ర యాదవ్ భార్య కవితను అరెస్ట్ చేశారు. గౌలిపురాలోని శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలుగా కవిత ఉన్నట్లు తెలుస్తోంది. HCA ప్రెసిడెంట్ అరెస్ట్ అనంతరం సీఐడీ కీలక విషయాలను వెల్లడించింది. శ్రీచక్ర క్రికెట్ క్లబ్ పేరుతో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నకిలీ పత్రాలు సృష్టించాడు. గౌలిపురా క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్ సంతకం ఫోర్జరీ చేశాడు.
కృష్ణాయాదవ్ సంతకాన్ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్ కవిత ఫోర్జరీ చేసింది. కవిత ఈ పత్రాలను జగన్మోహన్రావుకు అందించింది. ఈ పత్రాలను ఉపయోగించి జగన్మోహన్ రావు హెచ్సీఏ అధ్యక్షుడయ్యాడు. హెచ్సీఏ అధ్యక్షుడయ్యాక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది జగన్మోహన్ రావుపై ప్రధాన అభియోగం. నిధుల దుర్వినియోగం జరిగిందని టీసీఏ అధ్యక్షుడు గురువా రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో సీఐడీ రంగంలోకి దిగింది. జగన్మోహన్రావుకు HCA కోశాధికారి శ్రీనివాస్రావు, CEO సునీల్ సహకరించినట్లు CID గుర్తించింది. జగన్మోహన్రావుతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేయడంతో ఈ అంశం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ క్రికెట్ టీ-20 టికెట్లు, ఫ్రీ పాసుల కేటాయింపులకు సంబంధించి సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలో పేర్కొన్న టికెట్ల కంటే పది శాతం అదనంగా ఇవ్వాలని హెచ్సీఏ ఒత్తిడి చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. వ్యక్తిగతంగా టికెట్లు ఇవ్వకపోవడంతో జగన్మోహన్రావు ఇబ్బందులకు గురి చేసినట్లు సీఐడీ విచారణలో వెలుగు చూసింది. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు కూడా తాళాలు వేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లుగా ఆధారాలు సేకరించింది.
ఈ మేరకు హెచ్సీఏ, ఎస్ఆర్హెచ్ మధ్య మెయిల్స్ సహా అదనపు టికెట్ల కోసం హెచ్సీఏ ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడిన అంశాలను ఎస్ఆర్హెచ్ ప్రతినిధుల నుంచి రికార్డులు సేకరించారు. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణతో పాటు, హెచ్సీఏ రోజువారీ కార్యకలాపాలు, స్టేడియం నిర్వహణ అంశాలకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సీఐడీ సేకరించింది. పూర్తి డాక్యుమెంట్లతో సహా వివాదానికి గల కారణాలకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఐదుగురిని అరెస్ట్ చేసింది.