బాలయ్య మృతి చిత్ర సీమకు తీరని లోటు

బాలయ్య మృతి చిత్ర సీమకు తీరని లోటు

హైదరాబాద్: సీనియర్ నటుడు మన్నవ బాలయ్య మృతి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బాలయ్య మృతి పట్ల చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బాలయ్య 300 పైగా చిత్రాల్లో నటించారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అత్యుత్తమ నటుల్లో బాలయ్య ఒకరని కొనియాడారు. బాలయ్య ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చంద్రబాబు తెలిపారు. 

కాగా.. టాలీవుడ్ సీనియర్ నటుడు మన్నవ బాలయ్య (94)  యూసఫ్ గూడలోని తన స్వగృహంలో బాలయ్య ఈరోజు తుదిశ్వాస విడిచారు. నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత.. ఇలా బహుముఖ ప్రజ్ఞతో చిత్రసీమకు ఆయన విశేష సేవలందించారు. అందరివాడిగా, అతి సౌమ్యుడిగా పేరొందారు. ‘అమృత ఫిలిమ్స్’ పతాకంపై తన అభిరుచికి తగ్గ చిత్రాలను నిర్మించారు. కొన్నిటింకి దర్శకత్వమూ వహించారు. డైరెక్టర్ గా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు సినిమాలు తీశారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది పురస్కారం అందుకున్నారు. వందలాది చిత్రాల్లో క్యారెక్టర్ యాక్టర్‌గా నటించి మెప్పించారు. కెరీర్ మొదట్లో ఎం.బాలయ్య కొన్ని సినిమాల్లో హీరోగానూ యాక్ట్ చేశారు. ‘ఎత్తుకు పైఎత్తు’తోపాటు ‘భాగ్యదేవత’, ‘కుంకుమ రేఖ’ మూవీల్లో ఆయన కథానాయకుడిగా కనిపించారు.

ఇవి కూడా చదవండి...

అల్లు అర్జున్‌తో నటించాలని ఉంది

బిహార్లో ఏకంగా బ్రిడ్జినే దొంగిలించిన్రు