- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
తూప్రాన్, వెలుగు: యజ్ఞ యాగాలు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం తూప్రాన్ మున్సిపల్ పరిధి వెంకటాపూర్ లోని శ్రీ లలితా పరమేశ్వరి ఆలయంలో దేవి ఉపాసకుడు సోమయాజుల రవీందర్ శర్మ ఆధ్వర్య లో నిర్వహిస్తున్న ఆయుత చండీ యాగంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ..యజ్ఞాలు యాగాల వల్ల ప్రకృతిలో మార్పులు జరిగి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. పంటలు బాగా పండుతాయన్నారు.
ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ యజ్ఞం చేయాలన్నారు. అనంతరం వెంకటాపూర్ ను శక్తి కేంద్రంగా మార్చిన సోమయాజుల రవీందర్ శర్మ ను అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ నరేందర్ గౌడ్, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, వంటేరు ప్రతాప రెడ్డి, ఎస్ఐ శివానందం, స్థానిక నాయకులు రాంమోహన్ గౌడ్, జానకిరామ్ గౌడ్, మహేశ్ గౌడ్, నర్సోజీ, సాయిబాబా, మల్లేశ్ పాల్గొన్నారు.
