
ఊపిరితిత్తులకు సోకిన ఇన్ఫెక్షన్, న్యుమోనియా
అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స
ముషీరాబాద్: రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆరోగ్యం విషమించింది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలోని అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. గత నెల 28వ తేదీన కరోనా బారినపడ్డ నాయిని.. బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేరి 16 రోజులు చికిత్స పొందారు. వారం రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ రావడంతో త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని అనుకున్నారు. కానీ ఆయనకు మంగళవారం ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అయి న్యుమోనియా సోకిందనట్లు తేలింది. లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల నాయిని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయని డాక్టర్లు చెప్పారు. పల్మనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ సునీతారెడ్డి, కిడ్నీ స్పెషలిస్టు డాక్టర్ రవి ఆండ్రూస్, మరో డాక్టర్ కె.వి. సుబ్బారెడ్డిల పర్యవేక్షణలో ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
భార్య, అల్లుడు, మనుమడికి కరోనా
నాయిని భార్య అహల్యకు కూడా కరోనా సోకింది. ఆమె కూడా బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెకు కరోనా పరీక్షలో నెగెటివ్ వచ్చినప్పటికీ.. ఆస్పత్రిలోనే ఉండి మెరుగైన చికిత్స తీసుకుంటున్నారు. అలాగే నాయిని అల్లుడు, రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస్రెడ్డి మరియు ఆయన పెద్ద కుమారుడు కూడా కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ఎలా సోకింది..?
లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన నాయిని నరసింహారెడ్డి.. ఇటీవల ముషీరాబాద్లో జరిగిన కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ అభిమానులు అందించిన కేక్ను తిన్నారు. అలాగే ఓ మతపెద్ద ఇంటి ప్రహరీ గోడ కూలిన సమయంలో పరామర్శించేందుకు వెళ్లారు. దానికి తోడు ఓ మతపెద్ద సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక్కడే ఎక్కడో నాయినికి కరోనా సోకి ఉంటుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
For More News..