కాంగ్రెస్​ వైపు మల్లారెడ్డి చూపు!

కాంగ్రెస్​ వైపు మల్లారెడ్డి చూపు!
  • అల్లుడితో కలిసి పార్టీలోచేరేందుకు ప్రయత్నాలు
  • కొడుక్కు ఎంపీ టికెట్​ కోసం రిక్వెస్టులు
  • ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డితో 2 గంటలపాటు చర్చలు
  • తమ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆపాలని విన్నపాలు

హైదరాబాద్, వెలుగు : మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్​ వైపు చూస్తున్నారు. ఆయనతోపాటు ఆయన అల్లుడు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్​లో చేరేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. తన కుమారుడు భద్రారెడ్డికి కాంగ్రెస్​ మల్కాజ్​గిరి ఎంపీ టికెట్​ను కూడా మల్లారెడ్డి అడుగుతున్నట్లు తెలుస్తున్నది. ఇదే క్రమంలో గురువారం సీఎం రేవంత్​రెడ్డి సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డితో మామాఅల్లుళ్లు మల్లారెడ్డి, రాజశేఖర్​రెడ్డి భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గచ్చిబౌలిలోని వేం నరేందర్​రెడ్డి ఇంట్లో 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు మాత్రం బయటకు రాలేదు. ఒకవైపు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీల్లో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్న టైమ్​లోనే.. ఈ ఇద్దరు కలిసి వేం నరేందర్​రెడ్డితో భేటీ అయ్యారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆపాలని, కాంగ్రెస్ లో చేరుతామని, విషయాన్ని సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని వేం నరేందర్​రెడ్డితో మల్లారెడ్డి

రాజశేఖర్ రెడ్డి అన్నట్లు తెలుస్తున్నది. తన కొడుకు భద్రారెడ్డికి కాంగ్రెస్​ నుంచి మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ వచ్చేలా చూడాలని కూడా రిక్వెస్ట్​ చేసినట్లు సమాచారం. ఇప్పటికే బీఆర్ ఎస్ నుంచి ఎంపీ టికెట్ ఇస్తామని కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ నుంచి గెలిచే అవకాశాలు కనిపించడం లేదని, అందుకే కాంగ్రెస్ టికెట్ అడిగినట్లు ప్రచారం జరుగుతున్నది. 

భద్రారెడ్డికి ఇవ్వొద్దంటున్న కాంగ్రెస్​ నేతలు

వేం నరేందర్​రెడ్డిని మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి కలువడంతో మల్కాజ్​గిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో  సమావేశమయ్యారు. భద్రారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్దామని కాంగ్రెస్​ నేతలు అన్నట్లు తెలిసింది. రాజశేఖర్ రెడ్డి కాలేజీల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు, ప్రభుత్వానికి సంబంధం లేదని.. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ జరుగుతున్నదని, ఈ ప్రాసెస్ ఆగదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.