తిరుపతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఇవాళ తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
వైద్యురాలైన కుతూహలమ్మ కాంగ్రెస్ తరఫున చిత్తూరు జెడ్పీ చైర్ పర్సన్ గా రాజకీయ జీవితం ప్రారంభించారు. చాలా ఏళ్లు కాంగ్రెస్ లోనే ఉన్నారు. 2014లో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. సుమారు ఏడాదిన్నర క్రితం టీడీపీకు రాజీనామా చేశారు.
1985లో వేపంజేరి (ప్రస్తుతం జీడీనెల్లూరు) నియోజకవర్గం నుంచి గుమ్మడి కుతూహలమ్మ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్రెడ్డి హయాంలో వైద్యారోగ్య, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలందించారు. 2007లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్గానూ పని చేశారు. 1994లో కాంగ్రెస్ సీటు నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో జీడీనెల్లూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆమె టీడీపీలో చేరారు. జీడీనెల్లూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు.