‘వెంకన్న హత్యలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల పాత్ర’

‘వెంకన్న హత్యలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల పాత్ర’

సూర్యాపేట జిల్లా:  యర్కారం మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న హత్యలో అధికార పార్టీ నాయకుల పాత్ర ఉన్నట్లు తమ దగ్గర సమాచారముందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. అధికార పార్టీలో అంతర్గత కలహాల వల్లనే ఒంటెద్దు వెంకన్న హత్య జరిగిందని,  హత్య  కేసులో సమగ్ర విచారణ జరిపిస్తే అధికార పార్టీ నాయకుల పాత్ర బయటకు వస్తుందని ఆయన అన్నారు. సూర్యాపేటలో శనివారం  ప్రెస్ మీట్ నిర్వహించిన  దామోదర్ రెడ్డి.. పోలీస్ వైఫల్యం వల్లనే వెంకన్న హత్య జరిగిందన్నారు. పోలీసులు ఖాకీ డ్రెస్సు వదిలేసి గులాబీ డ్రెస్ వేసుకుని తిరుగుతున్నారని, ఈ కేసులో అమాయకులను ఇరికించి చిత్ర హింసలు పెడుతున్నారన్నారు.

కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్లపై కొందరు దాడులకు దిగుతున్నారన్నారు దామోదర్ రెడ్డి. కాంగ్రెస్ కార్యకర్తలను గ్రామాల్లోకి రానివ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారి పొలాలకు నీళ్లు పెట్టనివ్వకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. యర్కారం గొడవల విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే మానవహక్కుల సంఘాన్ని ఆశ్రహిస్తామని దామోదర్ రెడ్డి అన్నారు.