
హైదరాబాద్, వెలుగు: చేనేత రంగ అభివృద్ధికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. ఫాం టు ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ టు ఫ్యాషన్ అని స్టేట్మెంట్లు ఇవ్వడానికే పరిమితమైందని కేటీఆర్ విమర్శించారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే చేనేత, జౌళి శాఖపై మోడీ ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేకుండా పోయిందన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్, శ్రీలంక దుస్తుల ఉత్పత్తిలో మనకన్నా ఎంతో ముందున్నాయని కేటీఆర్ తెలిపారు. ‘‘పత్తి విస్తృతంగా పండించే మన దేశంలో చేనేత రంగానికి ఊతమిస్తే అద్భుతాలు చేయొచ్చు. మేము చెప్తున్నా కేంద్రం నుంచి కనీస స్పందన లేదు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన టెక్స్ టైల్, హ్యాండ్లూమ్ పార్కులకు చేయూతనివ్వడం లేదు” అని ఫైర్ అయ్యారు.