హైదరాబాద్: ఆన్ లైన్ బెట్టింగ్ యాపుల మరణాలు ఆగడం లేదు. బెట్టింగ్ యాపులకు బలై రోజు ఎక్కడో చోట ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. అత్యాశకు పోయి బెట్టింగ్ యాపులో డబ్బులు పెట్టి నష్టాలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు పరిధి దెబ్బడగూడకు చెందిన వాస్పూరి విక్రమ్ డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. అత్యాశకు పోయి ఇంట్లో నుంచి లక్ష రూపాయలు తీసుకెళ్లి అన్లైన్ బెట్టింగులో పెట్టాడు. బెట్టింగ్లో లక్ష రూపాయిలు పొగుట్టుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన విక్రమ్ పొలం దగ్గర పురుగుల మందు తాగాడు.
►ALSO READ | హైదరాబాద్లో పోలీస్ ఇంటికే కన్నమేసిన దొంగలు.. అరుణాచలం వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల !
గమనించిన కుటుంబ సభ్యులు విక్రమ్ను గాంధీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అన్న శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతికి అందొచ్చిన కొడుకు ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి బలి కావడంతో మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
