హైదరాబాద్: జనాభా పెరుగుదల లేకుండా, వృద్ధిరేటు ఏటా 6 శాతమే ఉంటే భారతదేశం 2047 నాటికి (అమృత్ కాల్) కూడా దిగువ మధ్యతరగతి దేశంగా మిగిలిపోతుందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. హైదరాబాద్లో మంథన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశం వేగంగా అభివృద్ధి చెందకపోతే, యువజనాభా పెరగకుండా వృద్ధుల సంఖ్య ఎక్కువ అవుతుందని అన్నారు.
"మీరు లెక్కేస్తే.. సంవత్సరానికి 6 శాతం గ్రోత్ చొప్పున, మీరు ప్రతి 12 సంవత్సరాలకు రెట్టింపు అవుతారు. తద్వారా 24 సంవత్సరాలలో మన తలసరి ఆదాయం నాలుగు రెట్లు పెరుగుతుంది. నేడు ఇది భారతదేశంలో 2,500 డాలర్ల కంటే కొంచెం తక్కువగా ఉంది. దీనిని నాలుగుతో గుణించండి.
పది వేల డాలర్లు అవుతుంది. కాబట్టి మీరు మన ప్రస్తుత వృద్ధి రేటు ప్రకారం లెక్కిస్తే మనది ధనికదేశంగా మారదు. 2047 నాటికి తక్కువ మధ్య ఆదాయాన్ని కలిగిన దేశం మాత్రమే అవుతుంది”అని ఆయన అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల చాలా ఆశించిన స్థాయిలో లేదని అన్నారు. మనం ధనవంతులుగా ఎదగకముందే వృద్ధులం అవుతామని రాజన్ తెలిపారు.