
వాషింగ్టన్: మాజీ టెర్రరిస్టులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సలహాదారులుగా నియమించారు. లష్కరే తోయిబా, అల్ కాయిదాతో సంబంధాలు ఉన్న ఇస్మాయిల్ రోయర్, టెర్రర్ కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ హమ్జా యూసుఫ్ను వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డులో నియమిస్తూ వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇస్మాయిల్కు 2008 ముంబై దాడులతో సంబంధాలు ఉన్నాయని, అంతేకాకుండా కాశ్మీర్లోని సైనిక స్థావరాలపైనా అతను కాల్పులు జరిపాడని అమెరికాకు చెందిన ఇన్విస్టిగేటివ్ జర్నలిస్టు లారా లూమర్ తెలిపారు.అలాగే, యూసుఫ్పై ఇండియాకు చెందిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఇప్పటికే పలు అభియోగాలు మోపిందని పేర్కొన్నారు. ఇస్మాయిల్ రోయర్ పుట్టుకతో అమెరికన్. 1992లో ఇస్లాం స్వీకరించి పేరు మార్చుకున్నాడు.
‘‘2000 సంవత్సరంలో ఇస్మాయిల్ రోయర్ పాకిస్తాన్ వెళ్లి ఒక టెర్రర్ క్యాంపులో ఉగ్రవాద శిక్షణ తీసుకున్నాడు. జిహాదీ భావజాలాన్ని వంటపట్టించుకున్నాడు. అలాంటి వ్యక్తిని వైట్ హౌస్ అడ్వైజరీ బోర్డులో నియమించారు” అని లూమర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అమెరికాలో టెర్రర్ కార్యకలాపాలకు పాల్పడడంతో 2003లో ఇస్మాయిల్పై అభియోగాలు నమోదయ్యాయని ఆమె గుర్తుచేశారు. ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించిన కేసులో 2004లో ఇస్మాయిల్కు 20 ఏండ్ల జైలుశిక్ష పడింది. 13 ఏండ్లు జైలుశిక్ష అనుభవించి 2017లో విడుదల అయ్యాడు.
ఎవరీ షేక్ యూసుఫ్..?
షరియా గురించి బోధించే జోటునా కాలేజీ కోఫౌండర్ హమ్జా షేక్ యూసుఫ్. హమాస్తో సంబంధాలు ఉన్నాయి. 9/11 దాడులకు ముందు జమీల్ అల్ అమీన్ (ఓ పోలీస్ఆఫీసర్ను హత్య చేశాడు) కోసం నిర్వహించిన ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాను జాత్యంహకార దేశంగా యూసుఫ్అభివర్ణించాడని లారా లూమర్ గుర్తుచేశారు.