కేటీఆర్ వ్యాఖ్యలకు త్రిపుర మాజీ సీఎం కౌంటర్

కేటీఆర్ వ్యాఖ్యలకు త్రిపుర మాజీ సీఎం కౌంటర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా బిప్లవ్ కుమార్ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు. జైన దేవాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడున్న నేతలతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయనతో V6 ముచ్చటించింది. హైదరాబాద్ బిర్యాని తిని, ఇరానీ ఛాయ్ తాగండి అంటూ మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలపై ఆయన మాట్లాడారు. బిర్యానీ తినిపించడానికి, ఛాయ్ తాగిపించడానికి ప్రగతి భవన్ కు పిలిస్తే తాము తప్పకుండా వస్తామని కౌంటర్ ఇచ్చారు. తమకు ఎవరూ శత్రువులు లేరని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పాలనపైనే తాము విమర్శలు చేస్తున్నామన్నారు. సంక్షేమ పాలన ఎక్కడుంటుందో.. అక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. 

కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలుకు నిధులు కేటాయిస్తోందన్నారు. నిధులు రావడం లేదనే విమర్శలను తిప్పికొట్టారు. నిధులు కావాలంటే సంబంధిత మంత్రిని కలవాల్సి ఉంటుందని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జీఎస్టీ సమావేశంలో ఆయా రాష్ట్రాల సీఎంలు లేదా ఆర్థిక మంత్రులు పాల్గొంటారని తెలిపారు. ఇటీవలే మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన సమావేశంలో ఏం చెప్పారని ప్రశ్నించారు. ఇక్కడకు వచ్చి మరో విధంగా స్టేట్ మెంట్ ఇవ్వడం సబబు కాదన్నారు. రాష్ట్రంలో బీజేపీని ఆదరించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నట్లు త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తెలిపారు.