ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. జూన్ 16న హాజరుకావాలని సూచన

ఫార్ములా-ఈ రేసు కేసు విచారణ.. కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. జూన్ 16న హాజరుకావాలని సూచన
  • ఈ నెల 16న హాజరుకావాలని సూచన
  • ఇప్పటివరకు 4 సార్లు నోటీసులిచ్చిన అధికారులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫార్ములా ఈ -రేసు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు శుక్రవారం ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్​లోని కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని సూచించింది. కేసు నమోదైనప్పటి నుంచి కేటీఆర్​కు నోటీసులు జారీ చేయడం ఇది నాల్గోసారి. ఈ కేసులో నిందితులుగా ఉన్న అర్వింద్ కుమార్, బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ రెడ్డిని ఏసీబీ అధికారులు ఇప్పటికే విచారించి స్టేట్​మెంట్లు రికార్డ్ చేశారు. వీటి ఆధారంగానే కేటీఆర్​ను మరోసారి ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధం అవుతున్నారు. అయితే, ఇప్పటి దాకా వీరిని అరెస్ట్ చేయలేదు.

సాక్షుల స్టేట్​మెంట్లు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్​లను మాత్రమే సేకరించారు. కాగా, జనవరి 9న ఫస్ట్ టైమ్ ఏసీబీ అధికారులు కేటీఆర్​ను విచారించి కీలక వివరాలు సేకరించారు. ఆ తర్వాత గత నెల 26న నోటీసులు జారీ చేశారు. 28న విచారణకు హాజరుకావాలని కేటీఆర్​కు సూచించారు. అయితే, తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నా అని, విచారణకు రాలేనని చెప్పారు. తిరిగి వచ్చాక అటెండ్ అవుతానని సమాధానం ఇచ్చారు. దీనికి ఏసీబీ అధికారులు అంగీకరించారు. కొన్ని రోజుల కిందే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కేటీఆర్​కు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు.

తుది దశ విచారణలో కీలక పరిణామాలు..!
గత బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో రూ.54.89 కోట్లు దుర్వినియోగం అయినట్లు నిరుడు డిసెంబర్‌‌ 29వ తేదీన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి మొదట్లో విచారణకు హాజరయ్యే క్రమంలో అధికారులు అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనక్కి వచ్చేశారు. ఆ సమయంలో ఆయన రాతపూర్వక వివరణ ఇచ్చారు. ఆ తర్వాత జనవరి 8న అర్వింద్‌‌కుమార్‌‌, జనవరి 9న కేటీఆర్‌‌, 10న హెచ్‌‌ఎండీఏ బోర్డ్‌‌ మాజీ చీఫ్ ఇంజనీర్‌‌‌‌ బీఎల్‌‌ఎన్‌‌ రెడ్డిని ఆ తర్వాత అదే నెల18న గ్రీన్‌‌కో ఏస్‌‌ నెక్స్ట్‌‌జెన్‌‌ ఎండీ చలమలశెట్టి అనిల్‌‌కుమార్‌‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు.

వీరందరి స్టేట్‌‌మెంట్ల ఆధారంగా ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌‌ఈవో) సంస్థ ప్రతినిధులను, సీఈవోను జూమ్‌‌ మీటింగ్‌‌ ద్వారా వర్చువల్‌‌గా విచారించారు. ఫార్ములా ఈ రేసు ప్రపోజల్స్‌‌, లండన్ కంపెనీతో సంప్రదింపులు, అగ్రిమెంట్లు, చెల్లింపులకు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను ఏసీబీ ఇప్పటికే సేకరించింది. తాజాగా కేటీఆర్‌‌కు ఏసీబీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు.